హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది.
దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్తో హ్యుందాయ్ గ్రూప్ తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఎకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుందాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
A great boost & a big investment for the Telangana Mobility Sector! @Hyundai_Global will be investing Rs. 1,400 Cr in setting up their Proving Grounds and will be a stakeholder & a consortium partner in the first of its kind New Mobility Valley created by the Telangana Govt. pic.twitter.com/LBnPSkadsI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022