హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్లను కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. నిరుడు ఈ జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలువగా.. ఈ ఏడాది అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రగామిగా ఆవిర్భవించింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), అనరాక్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 7 ప్రధాన మెట్రో నగరాల్లో జరిగిన ఈ సర్వేలో దాదాపు 5500 మంది ఎన్నారైలు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో పెట్టుబడులు పెట్టడంతో 60% పెట్టుబడులు ఈ 3 నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ ఏకంగా 22% పెట్టుబడులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (20%), బెంగళూరు (18%) నిలువగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నది.
విశాలమైన గృహాల కొనుగోలుకే మొగ్గు
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నారైల పెట్టుబడులు 15-20 శాతం మేరకు పెరిగినట్టు ఈ సర్వే తేల్చింది. దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య మొత్తం 2.73 లక్షల ఇండ్ల అమ్మకాలు జరిగాయని, వాటిలో 10-15 శాతం వరకు ఇండ్లను ఎన్నారైలే కొనుగోలు చేశారని వెల్లడించింది. వీరిలో 77% మంది విశాలమైన గృహాలను, 22% మంది డబుల్ బెడ్రూం ఇండ్లను కొనుగోలు చేసినట్టు తెలిపింది.
కొవిడ్ తర్వాత పెరిగిన పెట్టుబడులు
ఎన్నారైలలో ఎక్కువ మంది స్టాక్ మార్కె ట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రియల్ ఎస్టేట్ రంగంలోనే అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. దేశంలో ఎన్నారైల ఇండ్ల కొనుగోళ్లు కొవిడ్ ముందు నాటితో పోలిస్తే 55% మేరకు పెరిగినట్టు మార్కె ట్ వర్గాలు తెలిపాయి. 2019లో 11 బిలియన్ డాలర్లు (రూ.90,090 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు 2022లో 14.9 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు అంచనా వేశాయి. అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలు వ క్షీణించడం కూడా ఈ పెట్టుబడులు భారీగా పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు.