జీఎమ్మార్ ఏరోస్పేస్ పార్క్లో రెండు శాఫ్రాన్ సంస్థలు ప్రారంభం
త్వరలో ఐటీ, ఎమ్మార్వో కేంద్రం ఏర్పాటు
4 ప్రాజెక్టుల్లో 1950 కోట్ల పెట్టుబడి
ప్రత్యక్షంగా 2800 మందికి ఉపాధి
ఎమ్మార్వోతో భారత్తోపాటు పశ్చిమ, ఆగ్నేయాసియా విమానాలకు సేవలు
త్వరలో ఐరోపా, అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్
ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
శాఫ్రాన్ కేంద్రాల ప్రారంభోత్సవంలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఏరోస్పేస్-డిఫెన్స్ రంగానికి అనుగుణమైన ఎకో సిస్టం సృష్టితో రాష్ట్రం ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, శాఫ్రాన్ వరుసగా నాలుగో పెట్టుబడి ప్రకటన చేయడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎమ్మార్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కేంద్రం ద్వారా దేశీయ విమాన సంస్థలకే కాకుండా పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల విమానాలకు కూడా సేవలు అందుతాయని చెప్పారు. శంషాబాద్లోని జీఎమ్మార్ ఏరోస్పేస్ పార్క్లో గురువారం శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ, శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రెండూ సుమారు 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, ఒక్కోదానిలో 300 మంది చొప్పున మొత్తం 600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా శాఫ్రాన్ ఎమ్మార్వో సంస్థ.. శాఫ్రాన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది.
రూ.1,200 కోట్ల పెట్టుబడిగల ఎమ్మార్వోలో 1,000 మందికి, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్లో 800మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. మొత్తమ్మీద కంపెనీ 25 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,950 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటుచేసిన, ఏర్పాటుచేయనున్న నాలుగు కేంద్రాల్లో 2,800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, శాఫ్రాన్ సంస్థ భారత్లో గత 65 ఏండ్లుగా హిందుస్థాన్ ఎరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో సంయుక్త భాగస్వామ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. గడచిన ఆరేండ్లలో తెలంగాణలో రెండు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, తాజాగా రెండు పెట్టుబడుల ప్రకటన చేసిందని చెప్పారు. శాఫ్రాన్ మొదటిసారి సొంతంగా భారత్లో తమ కార్యకలాపాల నిర్వహణకు ముందుకురావడమే కాకుండా ఇందుకోసం తగిన సానుకూల వ్యవస్థ ఉన్న హైదరాబాద్ను ఎంచుకోవడం విశేషమని అన్నారు. తెలంగాణకు శాఫ్రాన్ పెట్టుబడిని రాబట్టేందుకు 2018 నుంచి 35 సార్లు హైదరాబాద్, ఢిల్లీ, పారిస్లో సమావేశమయ్యామని తెలిపారు. దాదాపు 400కుపైగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపామని, ఫలితంగా కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఇంజిన్లకు అవసరమైన ఎలక్ట్రిక్ పరికరాలను తయారుచేసే కంపెనీని కూడా 2018లో ప్రకటించిందని, అదే ఏడాది ఫ్రెంచ్ ప్రెసిడెంట్ సమక్షంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకున్నదని తెలిపారు. అలాగే, రెండో ప్రాజెక్టు శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ కోసం 2019లో ఒప్పందం జరిగిందని, ఇప్పుడు ఇవి రెండూ పనులు ప్రారంభించాయని చెప్పారు.
రక్షణ రంగ పర్యావరణ వ్యవస్థకు నెలవు
హైదరాబాద్లో బలమైన ఏరోస్పేస్ ఎకో సిస్టం ఉన్నదనేందుకు ఈ తాజా పెట్టుబడి మరో ఉదాహరణ అని కేటీఆర్ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలోని ఇతర కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన టెక్నాలజీ హబ్గా ఎదిగిందని, అందుకే శాఫ్రాన్ ఇక్కడ తమ ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్ఐపాస్ రూపంలో అత్యంత మెరుగైన పారిశ్రామిక పాలసీని అమలుచేస్తున్నదని అన్నారు. పలు ఏరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్లు ఇక్కడికి వచ్చాయని చెప్పారు. నైపుణ్యంగల సిబ్బందికి కొరతలేదని, ‘టాస్క్’ ఆధ్వర్యంలో నైపుణ్యాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు ఏరోస్పేస్, డిఫెన్స్ సప్లయ్ చెయిన్లో ఉన్నాయని చెప్పారు. టీహబ్, టీవర్క్స్, వీహబ్ ద్వారా నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు. ఈవోడీబీలో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఏరోస్పేస్ రంగంలో మోస్ట్ ప్రోగ్రెసివ్ ఔట్లుక్ అవార్డులకు 2018, 2020, 2022లో తెలంగాణను ఎంపికచేసిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కాస్ట్ ఎఫెక్టివ్నెస్లో, ఎఫ్టీఎఫ్డీఏ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకుల్లో గ్లోబల్ నంబర్-1 ర్యాంకును హైదరాబాద్ సొంతం చేసుకున్నదని గుర్తుచేశారు. విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా జీఎమ్మార్ ఎయిర్పోర్టు డిసెంబర్ నాటికి మరింత విస్తరిస్తుందని చెప్పారు. త్వరలో హైదరాబాద్నుంచి ఐరోపా, అమెరికా దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఏరోస్పేస్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
రక్షణ రంగానికి కూడా విస్తరణ: శాఫ్రాన్ సీఈవో
భారత్లో వచ్చే 20 ఏండ్లలో ప్రయాణికుల రద్దీ రెట్టింపుకన్నా అధికమవుతుందని, ఈ నేపథ్యంలో ఎమ్మార్వోకు మంచి గిరాకీ ఉంటుందని శాఫ్రాన్ సీఈవో ఒలివియర్ ఆండ్రీస్ తెలిపారు. వాణిజ్య ఇంజిన్ల కోసం నిర్మిస్తున్న ఈ ఎమ్మార్వో సేవలు భవిష్యత్తులో రక్షణరంగానికి కూడా విస్తరిస్తామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో తమ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యను మూడు రెట్లు పెంచుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సానుకూల వ్యవస్థతో తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజాగా శాఫ్రాన్ సంస్థ ఎమ్మార్వో ప్రాజెక్టును ప్రకటించిందని, ఇది 2025వరకు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 15 కోట్ల డాలర్ల పెట్టుబడితో కూడిన ఈ ఎమ్మార్వో శాఫ్రాన్కు చెందిన అతిపెద్ద కేంద్రమని, భారత్లో కూడా ఇదే అతిపెద్ద ఎమ్మార్వో అవుతుందని చెప్పారు. దీనికోసం 2020 నుంచి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. తగిన మార్కెట్ కోసం ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లతో కూడా చర్చలు జరిపామని చెప్పారు. ఎమ్మార్వో సేవల్లో ప్రపంచ పోటీని తట్టుకొనేందకు జీఎస్టీలో సడలింపులు ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరిపి, సాధించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ ఎమ్మార్వో కేవలం భారత్లోని వైమానిక సంస్థలకే కాకుండా పశ్చిమాసియా, ఆగ్నేయాసియాకు చెందిన విమాన సంస్థలకు కూడా సేవందిస్తుందని చెప్పారు.