హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మెట్రో రెండోదశలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంగళవారం మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు లింక్ రోడ్డు, దేశంలోనే తొలిసారి అన్ని మతాలవారికోసం ఏర్పాటుచేసిన ముక్తిఘాట్, పెంపుడు జంతువుల శ్మశాన వాటికలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒక్కరోజే రూ.55 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంపై సంతోష వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగు తీస్తున్నాయని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి అయ్యేది మళ్లీ కేసీఆరేనని స్పష్టంచేశారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ఎనిమిదేండ్లుగా పాలన సాగుతున్నదని అన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలతో లక్షల మందిని ప్రభుత్వం ఆదుకొంటున్నదని చెప్పారు. అభివృద్ధిలో కూడా ఓ కొత్త నమూనాను ఆవిష్కరిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు. పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, పర్యావరణం, వ్యవసాయం, ఐటీ, సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ మాడల్ను దేశం ముందు ఉంచామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినపుడు రూ.1.24 లక్షలు ఉన్న తలసరి ఆదాయం, ప్రస్తుతం రూ.2.78 లక్షలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తలసరి ఆదాయం పెరుగుదలలో దేశ సగటును తెలంగాణ దాటిందని, ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్నదని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇదంతా ‘ఛూ మంతర్ అనగానే.. లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపం’ సాయంతో జరుగలేదని అన్నారు. ప్రజలకు ఏమి అవసరమో గుర్తించి, ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణ, సరైన వ్యూహంతో ముందుకు సాగడం వల్లనే సాధ్యమయ్యాయని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 20 అత్యుత్తమ గ్రామ పంచాయతీలలో 19 గ్రామాలు తెలంగాణ రాష్ర్టానికి చెందినవే ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద అత్యుత్తమ మున్సిపాలిటీలను ఎంపిక చేస్తే అత్యధికంగా రాష్ర్టానికే 26 అవార్డులను కేంద్రం ఇచ్చిందని వెల్లడించారు.
వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంగా రూ.985 కోట్లతో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులు వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 34 పనులు చేపట్టామని, రెండు పూర్తయ్యాయని తెలిపారు. నెలాఖరుకు 17, వచ్చే నెలాఖరుకు 15 పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులు ఏప్రిల్ నాటికి మొదటి విడత పూర్తిచేసి, రెండో విడత పనులు చేపడుతామని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద పనులతోనే ఎల్బీనగర్ చౌరస్తా రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మౌలిక వసతులు కల్పించకపోతే వెనుకబడిపోయి.. బెంగళూరులా మారుతుందని చెప్పారు. మూసీపై రూ.52 కోట్లతో నిర్మించనున్న వంతెన ద్వారా వరంగల్ హైవే-విజయవాడ హైవేకు రాకపోకలు సులువుగా మారతాయని చెప్పారు. మూసీపై కొత్తగా 14 వంతెనలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఆటోనగర్లో ఫ్లవర్గార్డెన్స్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ప్రభుత్వ పనితీరుకు ఎల్బీనగర్ చౌరస్తాయే ఉదాహరణ అని వివరించారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, వాణీదేవి, బొగ్గారపు దయానంద్, శంభీపూర్రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు వై సతీశ్రెడ్డి, అమరవాది లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ పంకజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని సీఎల్ఐఎన్టీ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సం జీవ్దాస్ గుప్తా చెప్పారు. నవీ ముంబైకి చెందిన గ్రీన్ఫీల్డ్ డాటా సెంటర్ డెవలప్మెంట్ సైట్ను 2021లో కొనుగోలు చేయడంతో ఇండియన్ డాటా సెంటర్ మారెట్లోకి కంపెనీ ప్రవేశించిందని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్న డాటా సెంటర్ రెండోదని వెల్లడించారు. క్యాపిటల్యాండ్ ప్రైవేట్ ఈక్విటీ ఆల్టర్నేటివ్ అసెట్స్, రియల్ అసెట్స్ సీఈ వో పాట్రిక్ బూకాక్ మాట్లాడుతూ.. ఆసియా, యూరప్ దేశాల్లో ఉన్న 25 డా టా సెంటర్లతో పోల్చుకుంటే గత కొన్నేండ్లుగా తాము డాటా సెంటర్ డిజైన్, అభివృద్ధి, నిర్వహణలో ఎంతో ముందంజలో ఉన్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న తమ ప్రణాళికలో భాగంగా క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్తో కలిసి ఇండియాలో రెండో డాటా సెంటర్ ప్రాజెక్ట్ను ఏర్పాటుచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. డాటా రంగంలో ఇండియాలోనే నంబర్వన్గా నిలవాలన్న ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ సెంటర్ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు ఏనాడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మనుషులకు ఓట్లు ఉన్నందున, వారిని బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 260 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. పంచాయతీలు, మున్సిపాలిటీలల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ తీసుకొచ్చి హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్ పెంచామని చెప్పారు. గతంలో ఫతుల్లాగూడ ఏరియా దుర్వాసనతో ఉండేదని, అపురూపమైన పార్కుగా రూపుదిద్ది ముక్తిఘాట్ను ఏర్పాటుచేశామని వివరించారు. రూ. 16 కోట్లతో అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఒకే చోట అంతిమ సంస్కారాలను సంస్కారవంతంగా చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల వారందరికీ ఆచారాలు, ధర్మాలకు అనుగుణంగా శ్మశాన వాటిక ఏర్పాటుచేశామని చెప్పారు. ఫతుల్లాగూడ మీదుగా పీర్జాదిగూడ వరకు వెళ్తున్న రోడ్డులో రకరకాలు మొక్కలు పెట్టామని, త్వరలో సినిమా షూటింగ్లు జరుగుతాయని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చెప్తుంటే సంతోషం అనిపించిందని కేటీఆర్ మురిసిపోయారు.