హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ కుదించారా? నాలుగు దేశాలకు బదులు రెండు దేశాలకే పరిమితమయ్యారా? దీని వెనుక కారణం ఏమిటి? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది! కాగితాలపై మాత్రం రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎంవోయూలు, సంతకాలు. ఇది తమ ఘనతగా చెప్పుకొనేందుకు రూ.కోట్లు వెచ్చించి ప్రచారం. తీరా రాష్ట్రంలో వెలసిన పరిశ్రమలు చూస్తే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా.. ఇదీ నిరుడు డిసెంబర్లో హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సాధించిన ఘనత. తెలంగాణలో పెట్టుబడుల వరద పారుతున్నదంటూ రేవంత్రెడ్డి ప్రభు త్వం చెప్తున్నవన్నీ గారడీ లెక్కలేనని తేలిపోతున్నాయి. రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రభుత్వం ఊదరగొట్టగా, ఏడాదైనా కనీసం 5శాతం కూడా ఆచరణలోకి తీసుకురాలేక బోల్తాపడింది. దీంతో గ్లోబల్ సమ్మిట్ ఒక విఫల సదస్సుగా, పాలకుల పబ్లిసిటీ స్టంట్గా మిగిలిదని విమర్శలొచ్చాయి.
మంత్రివర్గం అసహనం పాత ఎంవోయూల కథ కొలికి రాకముందే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ విదేశీ పర్యటనలకు వెళ్తుండటంపై పారిశ్రామిక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి రాష్ట్ర క్యాబినెట్కు కూడా తత్వం బోధపడిందట. అందుకే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి షెడ్యూల్పై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘పోయిన సమ్మిట్లో మీరు వన్మెన్ షో చేశారు.. ప్రచారం కోసం పెట్టిన ఖర్చులకు సరిపడా పెట్టుబడులు కూడా రాలేదు’ అని ఉత్తర తెలంగాణ మంత్రి సీఎం ముఖం మీదనే అన్నట్టు తెలిసింది.
గ్లోబల్ సమ్మిట్ అనుకుంటే పారిశ్రామిక దిగ్గజాలు ఎవరూ రాకపోవడంతో అది లోకల్ సమ్మిట్గా మిగిలిపోయిందని అన్నారట. సమ్మిట్ నడుస్తున్న తీరు చూసి ఆఖరికి పార్టీ పెద్దలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వంటివారు కూడా రావడానికి ముఖం చాటేశారని సదరు మంత్రి గుర్తుచేసినట్టు సమాచారం. గత సమ్మిట్ ద్వారా సాధించిందేమీ లేకపోవడం, వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి విదేశాలకు వెళ్లడం సరికాదని మరో మంత్రి తేల్చి చెప్పినట్టు తెలిసింది. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా అందుబాటులో ఉండాలని మంత్రులు ఒత్తిడి చేసినట్టు సమాచారం. భవిష్యత్తులో పెట్టుబడులు రాకపోతే ప్రజలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలేమని హెచ్చరించినట్టు తెలిసింది.
మంత్రివర్గ సహచరుల స్పందనతో సీఎం షాక్ అయ్యారని, దీంతో తన పర్యటనను 19 రోజుల నుంచి 11 రోజులకు కుదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీఎం టూర్ బుధవారం నుంచి ప్రారంభమై ఈ నెల 30 వరకు కొనసాగనున్నదని వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయంత్రం బ్రిటన్ పర్యటనకు బయలుదేరనున్నారు. అనంతరం అమెరికాకు వెళ్తారు. టూర్ షెడ్యూల్ నుంచి చైనా, జర్మనీ దేశాలను ఎత్తేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మొదట యూకే, అమెరికాతోపాటు చైనా, జర్మనీలోనూ పర్యటించాలని నిర్ణయించినా, క్యాబినెట్ సూచన మేరకు మార్పులు చేశారట. సీఎం తన పర్యటనలో భాగంగా బ్రిటన్, అమెరికాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. విదేశీ రోడ్ షోలు, సమ్మిట్లలో రూ.కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నా, వాటిని నిరంతరం పర్యవేక్షించి, అమల్లోకి తెచ్చే అధికార యం త్రాం గం పరిశ్రమల శాఖలో లేకుండాపోయింది.
నిరుడు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అనంతరం డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్ హబ్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని ప్రభుత్వం పెద్ద ఎత్తున హంగామా చేసింది. సదస్సు ముగిసి ఏడాది దాటినా ఒప్పందాలు పట్టాలెకకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమ్మిట్లో కుదిరిన మొత్తం 75 ఎంవోయూల్లో కేవలం 14 మాత్రమే ఆపరేషనల్ దశకు చేరుకున్నాయని అధికారులు స్పష్టం చేశారట.
ఆ 14 ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.30,230 కోట్లు మాత్రమేనని, ప్రకటించిన రూ.5.75 లక్షల కోట్లలో ఇది కేవలం 5.3 శాతమేనని ఉన్నతాధికారులు సీఎంకు వివరించినట్టు సమాచారం. మిగిలిన 61 ఎంవోయూలకు సంబంధించి పెట్టుబడిదారులెవరూ అందుబాటులోకి రావడం లేదని చెప్పారట. అందులో దాదాపు 70 శాతం బోగస్ కంపెనీలేనన్న అనుమానాలు వ్యక్తమైనట్టు తెలిసింది.