Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను అత్యంత జీవనయోగ్యమైన నగరంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజన్ అని ఆ మేరకే నగరంలో రవాణా సదుపాయాలను విస్తరిస్తున్నారని మెట్రో రైల్ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణ ప్రణాళికకు సంబంధించిన రూట్మ్యాప్ను ఆయన మంగళవారం బేగంపేటలోని మెట్రో భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో మరో 50 ఏండ్ల దాకా తాగునీటికి ఢోకా లేకుండా సదుపాయాలు కల్పించిందని, ఇప్పుడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంవైపు దృష్టి సారించిందని అన్నారు. అందులో భాగంగానే మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణ అని చెప్పారు.
భవిష్యత్తులో హైదరాబాద్ ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా మారబోతున్నదని, రోడ్లపై ట్రాఫిక్ను తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని, ఫలితంగా నగరం మోస్ట్ లివబుల్ సిటీగా మారుతుందన్నది సీఎం కేసీఆర్ విజన్ అని తెలిపారు. ఆ క్రమంలోనే నగరం నలుదిశలా మెట్రో రైలు వ్యవస్థను విస్తరించాలని భావిస్తున్నారని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 2007లోనే తాను నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి మెట్రో రైలు గురించి ప్రతిపాదించానని తెలిపారు. అయితే హైదరాబాద్లో మెట్రో రైలు అసాధ్యమని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్లో భాగంగానే ఇప్పుడు ఔటర్ రింగ్రోడ్డు వరకు మెట్రో రైలు వ్యవస్థను విస్తరించనున్నామని తెలిపారు.
నగరానికి 50 కిలోమీటర్ల దాకా మెట్రో
హైదరాబాద్ జనాభా రెండు కోట్లు దాటినా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికను రూపొందించిందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు విస్తరణతో నగరవాసులు సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. కోర్ సిటీతోపాటు ఔటర్ రింగురోడ్డు చుట్టూ, నగరానికి 40-50 కిలోమీటర్ల దాకా అత్యంత మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దశలవారీగా ఆయా మెట్రో మార్గాల్లో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధికంగా మెట్రో రైల్ నెట్వర్క్ను విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మొత్తం 415 కి.మీ పొడవుతో 186 మెట్రో స్టేషన్లతో నగరం నలుమూలలా ప్రజలకు మెట్రో ప్రయాణ సాధనంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే మొదటి దశలో 69 కి.మీ మెట్రో మార్గం అందుబాటులో ఉండగా, మిగిలిన మెట్రో మార్గాన్ని మూడు నాలుగేండ్లలో రూ.69,100 కోట్లతో నిర్మించేందుకు ప్రాథమికంగా అంచనాలను సిద్ధం చేశామని చెప్పారు.
మూడో దశ- మొదటి భాగం (ఎలివేటెడ్)
1. బీహెచ్ఈఎల్ – పటాన్చెరు – ఓఆర్ఆర్ – ఇస్నాపూర్ -13km
2. ఎల్బీనగర్-హయత్నగర్- పెద్ద అంబర్పేట -13 km
3. శంషాబాద్ జంక్షన్ మెట్రోస్టేషన్- కొత్తూరు-షాద్నగర్ – 28km
4. ఉప్పల్-ఓఆర్ఆర్-ఘట్కేసర్- బీబీనగర్ – 25 km
5. ఎయిర్పోర్టు-తుక్కుగూడ-మహేశ్వరం-కందుకూరు – 26km
6. తార్నాక-ఈసీఐఎల్ – 8 km
7. జేబీఎస్- తూంకుంట (డబుల్ ఎలివేటెడ్) – 17km
8. ప్యారడైజ్ మెట్రో స్టేషన్- కండ్లకోయ (డబుల్ ఎలివేటెడ్) – 12km
మొత్తం – 142 km
మూడో దశ- రెండో భాగం ఓఆర్ఆర్ చుట్టూ (ఎలివేటెడ్/భూమార్గం)
9. శంషాబాద్-తుక్కుగూడ-బొంగులూరు- పెద్ద అంబర్పేట -40 km
10. పెద్ద అంబర్పేట- ఘట్కేసర్- శామీర్పేట- మేడ్చల్ -45 km
11. మేడ్చల్-దుండిగల్- పటాన్చెరు – 29 km
12. పటాన్చెరు-కోకాపేట జంక్షన్- నార్సింగి జంక్షన్ – 22 km
మొత్తం – 136 km