KIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): హృద్రోగుల్లో రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు గుండెలోని రక్తనాళాల్లో స్టంట్లు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ, హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు ఏకంగా ఓ మహిళ వెన్నెముకలోని ఎముకకే స్టంట్ వేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అరుదైన శస్త్రచికిత్సతో ఆమెకు సమస్య నుంచి ఉపశమనం కల్పించారు. హైదరాబాద్లో ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ఇదే తొలిసారి.
వివరాల్లోకి వెళ్తే.. 65 ఏండ్ల వయసున్న ఓ మహిళ గత నెల ఇంట్లో కింద పడిపోవడంతో విపరీతమైన వెన్నునొప్పి మొదలైంది. అనంతరం పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆమె కొండాపూర్లోని కిమ్స్ దవాఖానను ఆశ్రయించింది. దీంతో ఆమె వెన్నెముక విరిగినట్టు తేల్చిన వైద్యులు.. శస్త్రచికిత్సతో ఎముకను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా విరిగిన వెన్నెముకకు స్టెంటింగ్ చేసి మెరుగైన చికిత్స అందించారు. అనంతరం ఆమె గంటల వ్యవధిలోనే కోలుకుని నడిచినట్టు కిమ్స్ వైద్యులు తెలిపారు. విరిగిన ఎముకలను సరిచేసేందుకు ఎలాంటి రక్తస్రావం లేకుండా ఈ శస్త్రకిత్స చేయవచ్చని, దీంతో వృద్ధులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.