హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ): తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన 70మంది అధికారుల బృందం గతంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడి కలప కళాకృతులను పరిశీలించింది.
అదే బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని రెండు రోజులపాటు నిశితంగా పరిశీలించింది. ఆలయంలోని కలప కళాకృతులు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నట్టు తేలింది. వెంటనే టింబర్ డిపోను సందర్శించి నిరుడు మే నెలలో ఆలయ ద్వారాలు, తలుపులకు సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు.
జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ నగరం నుంచి ఆలయ ద్వారాలు వెళ్లనుండడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం యాద్రాద్రి అనే ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించకపోయి ఉంటే అయోధ్య రామయ్య ఆలయానికి తలుపులు అందించే మహద్భాగ్యాన్ని నగరం కోల్పోయి ఉండేదని అనురాధ డింబర్ డిపో అధినేత చదలవాడ శరత్బాబు తెలిపారు. అప్పట్లో యాదాద్రిని సందర్శించిన తమిళనాడు బృందం సభ్యులు ఆలయ కళాకృతులను చూసి మంత్రముగ్ధులైనట్టు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషన్రావు తెలిపారు. యాదాద్రి నారసింహుడే అయోధ్య రాముడికి తలుపులు రూపొందించే మార్గం చూపాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించే ఆలయాలకు యాదాద్రి ఏదో రకంగా ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా, నేత్రపర్వంగా తీర్చిదిద్దింది. ఆలయ పునర్నిర్మాణం కోసం అప్పటి సీఎం కేసీఆర్ దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా పరిశీలించి అధ్యయనం చేశారు. చివరికి వివిధ శిల్పకళా వైభవం భక్తులకు ఒకేచోట కనువిందు చేసేలా రూపొందించి దేశాన్ని అబ్బురపరిచారు. కేసీఆర్ నాడు చేసిన ఓ గొప్ప ఆలోచన నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుండడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.