హైదరాబాద్, జనవరి 23 : రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారుతున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు ద్విముఖవ్యూహంతో ముందుకు వెళ్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చటమే లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో క్షేత్రస్థాయిలో దాడులు ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలో కీలకమైన టోనీ అరెస్టు తర్వాత ఫోకస్ మరింత పెంచినట్టు వివరించారు. డ్రగ్స్, మత్తుపదార్థాల వాడకం నుంచి యువతను కాపాడేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్టు సీవీ ఆనంద్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కేవలం డ్రగ్స్ సరఫరాదారుల అరెస్టుతో సరిపెట్టకుండా ముఠాల్లోని కీలక వ్యక్తులను అరెస్టు చేసేలా ఆపరేషన్లు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. టోనీ గ్యాంగ్తో సంబంధాలున్న అంతర్జాతీయ ముఠాను పట్టుకొనే వరకు దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సహకారంతో దాడులు నిర్వహించి ముఠా మూలాలను ఛేదిస్తామని తేల్చిచెప్పారు. అదే సమయంలో డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ఇందుకోసం సొసైటీలోని వివిధ వర్గాలను ఏకంచేసేలా చర్యలు తీసుకొంటామని, ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
త్వరలోనే పబ్లు, బార్ల యాజమాన్యాలతో భేటీ
మత్తు పదార్థాల వినియోగాన్ని సరఫరా దా రులపైనే కాకుండా వినియోగదారుల వైపు నుంచీ కట్టడి చేయాలి. ఇందుకోసం వినియోగదారులు, డ్రగ్స్ సరఫరాకు ఆస్కారం ఉన్న పబ్లు, బార్ల యాజమాన్యాలతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తాం. బార్ లేదా పబ్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే యాజమాన్యంపై కేసులు పెడతామని హెచ్చరిస్తాం. నేరు గా యాజమాన్యాలను బాధ్యులను చేయడం ద్వారా ఫలితం ఉంటుందని భావిస్తున్నాం. -హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్