Harish Rao | హైదరాబాద్ ఒక మెడికల్ హబ్గా రూపొందడం చాలా సంతోషకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని.. ఇక్కడ ఉండే ఇన్ఫ్రా కావచ్చు, డాక్టర్ కావచ్చని తెలిపారు. సుమన్ టీవీ డాక్టర్స్అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. డాక్టర్స్కు ఇంత మంచి అవార్డులను అందిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి, వారి బృందానికి తన అభినందనలు తెలిపారు. చాలా వృత్తులు చాలా బిజినెస్లు ఉంటాయి. కానీ డాక్టర్కు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారని.. తల్లి జన్మనిస్తే ఒక ఆపదలో ఉన్న పేషెంట్ కు పునర్జన్మని ఇచ్చేది డాక్టర్ అని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లకు మరింత బాధ్యతగా సేవలు చేసే విధంగా, కొత్తవారిని సేవలు చేసే విధంగా ఈ అవార్డులు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
కరోనా సమయంలో డాక్టర్ల గొప్పదనం బయటపడిందని.. ప్రాణాలను లెక్కచేయకుండా రాత్రింబవళ్ళు కష్టపడ్డారని హరీశ్రావు అన్నారు. కుటుంబాన్ని, కట్టుకున్న భార్యని, పిల్లలను చూడ్డానికి కూడా భయపడ్డ రోజుల్లో తమ ప్రాణాలను లెక్కచేయకుండా రాష్ట్రంలో అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. దేశ నలుమూలల నుంచి వైద్యానికి చాలామంది పేషెంట్లు హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు సైతం హైదరాబాద్ కొచ్చి వైద్యం పొందుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా రూపొందడం చాలా సంతోషకరమని అన్నారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని.. ఇక్కడ ఉండే ఇన్ ఫ్రా కావచ్చు డాక్టర్లు కావచ్చు.. అన్ని విధాల హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారిందని అన్నారు.
కేసీఆర్ కృషితో భారత దేశంలో డాక్టర్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని హరీశ్రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో రాష్ట్రంలో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలను 35 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం 10వేల మంది డాక్టర్లు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలే కాదు దేశానికి అవసరమయ్యే డాక్టర్లను అందించే విధంగా తయారుచేసిందని చెప్పారు. హైదరాబాదు నాలుగు మూలల్లో నాలుగు టిమ్స్ హాస్పిటళ్లను, వరంగల్లో హెల్త్ సిటీ పనులను కూడా తమ ప్రభుత్వంలో ప్రారంభించామని గుర్తుచేశారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి, ప్రతీ కాలేజీలో పీజీతో పాటు నర్సింగ్, ఫార్మసీ కాలేజ్ కూడా అనుసంధానం చేశామని తెలిపారు. డాక్టర్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎంతో ముఖ్యమని.. ముందు చూపుతో వాటిని కూడా మేము ప్రణాళిక బద్ధంగా ప్రారంభించామని పేర్కొన్నారు.
పేషెంట్లు వస్తే డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామనే డాక్టర్లే కాకుండా ఉచితంగా ప్రాణాలు కాపాడేవారు కూడా ఉంటారని హరీశ్రావు తెలిపారు. ములుగు, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు గొప్ప వాళ్లని కొనియాడారు. మారుమూల ప్రాంతంలోకి పోయి డాక్టర్లు సర్వీస్ చేయాలంటే వారి పిల్లలకు, వారి కుటుంబానికి అక్కడి వసతులు, చదువు వంటి సౌకర్యాలు లేకపోయినా వారు ముందుకెళ్లి పని చేస్తుంటారని పేర్కొన్నారు. బార్డర్లో పనిచేసే సైనికుడికైనా, దేశానికి అన్నం పెట్టే రైతుకైనా, ప్రాణాలను కాపాడే వైద్యులకైనా సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో వైద్యరంగంలో మన రాష్ట్రం ప్రముఖమైన పాత్ర పోషించాలని, ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.