హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోకి ఎగిరేది. రోజూ పదుల సంఖ్యలో మాత్రమే తిరిగే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉండేది. కానీ, శంషాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సగటున ప్రతి 3.6 నిమిషాలకు ఒకటి చొప్పున రోజూ దాదాపు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నిత్యం దాదాపు 50 వేల మంది చొప్పున ఏటా 2 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ముందంజలో నిలిచింది. ఇటీవల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాశ్రయ కాంట్రాక్టు గడువును మరో 30 ఏండ్లు (2068 వరకు) పొడిగించింది.
ఉత్తర-దక్షిణ గేట్వేగా..
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై తదితర నగరాలకు సులభంగా ప్రయాణించవచ్చు. ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని మరింత విస్తరించి ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా వీలుకల్పించేందుకు జీఎమ్మార్ సంస్థ చర్యలు చేపడుతున్నది. అంతేకాకుండా దాదాపు రూ. 8,500 కోట్లతో 1,500 ఎకరాల్లో ఏరో సిటీని నిర్మిస్తున్నది. దీనిలో దేశ, విదేశీ ప్రయాణికులు బస చేసేందుకు వీలుగా సర్వీస్ట్ అపార్ట్మెంట్లు, వివిధ ఐటీ సంస్థల కా ర్యాలయాలు, హోటళ్లు, హాస్పిటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వినోద కేంద్రాలు, విద్యాసంస్థలు, ఉంటాయి.
గణనీయమైన వృద్ధి రేటు
ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణాలు సాగించేలా 2008లో ప్రారంభమైన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 2016-17లో 1.52 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2017-18 నాటికి ఈ సంఖ్య 17% పెరిగి 1.83 కోట్లకు చేరింది. 2018-19లో మొదటి టెర్మినల్ నుంచే రికార్డు స్థాయిలో 2.14 కోట్ల మంది ప్రయాణించారు. ఇలా ఏటా ప్రయాణికుల రద్దీతో పాటు సరుకు రవాణా సైతం పెరుగుతున్నది. దీంతో ఇప్పుడు ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు.
విస్తరణతో ప్రత్యేక వసతులు
శంషాబాద్ విమానాశ్రయ విస్తరణతో ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ విస్తీర్ణం 3,79,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెకిన్ కౌంటర్లు, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఏటీఆర్ఎస్తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలు ఉంటాయి. దేశ, విదేశీ ప్రయాణికులకు మరిన్ని లాంజ్లు, రిటైల్, ఫుడ్ అండ్ బేవరేజెస్ అవుట్లెట్లు, 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరవైల్ గేట్లు అందుబాటులోకి వస్తాయి. విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా 4 ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను.. ప్రయాణికులు విమానంలోకి ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా 3 కొత్త ఏరోబ్రిడ్జీలను అందుబాటులోకి తెచ్చారు. కాంటాక్ట్లెస్ ప్రయాణాల కోసం 6 ఈ-గేట్లు ఉంటాయి. గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) కోసం కొత్తగా సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇది విమానాశ్రయానికి తూర్పు వైపున ఉన్న 42 రిమోట్ ఎయిర్క్రాఫ్ట్ స్టాండ్లను కలుపుతుంది.
సరికొత్త ఆవిష్కరణలకు నాంది
విమానాశ్రయ రంగానికి సంబంధించిన అనేక సాంకేతిక ఆవిషరణలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నాంది పలికింది. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏవోసీసీ), అత్యాధునిక సమాచార, భద్రతా వ్యవస్థలను కలిగివున్న ఈ విమానాశ్రయం.. దేశ, విదేశీ ప్రయాణికులకు పేపర్ లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
దేశంలో నాలుగో స్థానం
ప్రస్తుతం దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా శంషాబాద్ విమానాశ్రయం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. తొలి మూడు స్థానాల్లో వరుసగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ, వైశాల్యపరంగా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్టు (5.2 వేల ఎకరాలు) ఢిల్లీ విమానాశ్రయం (5 వేల ఎకరాలు) కంటే పెద్దది. దీంతో ఈ ఎయిర్పోర్టు కేంద్రంగా సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. జీఎమ్మార్తో కలిసి ఈ వర్సిటీ ఏర్పాటుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఇక్కడ ఏవియేషన్ స్కూల్ ప్రారంభమైంది.