హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్రయిస్తుండగా ఇది కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం స్థానికంగా హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా ముగ్గురు సీనియర్ శాస్త్రవేత్తల బృందాన్ని జనవరిలో వారణాసిలోని జాతీయ విత్తనోత్పత్తి శిక్షణకు పంపింది. అక్కడ హైబ్రిడ్ విత్తనోత్పత్తికి అనుసరించాల్సిన పద్ధతులను అధ్యయనం చేశారు. త్వరలోనే విత్తనోత్పత్తి కార్యాచరణ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు. డిమాండ్ ఉన్న టమాట, కాకర, వంకాయ, బీర వంటి రకాల హైబ్రిడ్ విత్తనాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చిమిర్చి హైబ్రిడ్ రకాలను మలేషియా, జపాన్ వంటి దేశాలు ఉత్పత్తి చేయడం గమనార్హం.