యాదాద్రి: దళితబంధు పథకంపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొట్టి పారేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధును అమలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఏదో ఒక ప్రాంతంలో పరిమితమయ్యే పథకాలు కావని, యావత్ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని సూచించారు. శ్రావణమాసం సందర్భంగా శనివారం మంత్రి తలసాని కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. స్వామి వారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
అనంతరం కొండపైన హరిత టూరిజం హోటల్లో మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణలు మహాద్భుతంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ అధ్బుత కళాఖండంగా యాదాద్రి నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. హిందువులమని చెప్పుకునే కేంద్ర అధికార బీజేపీ దేశంలో ఎక్కడనైనా ఆలయాలు నిర్మించారా అని ప్రశ్నించిన మంత్రి, కనీసం హిందువుల పండుగలను సైతం అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. 7 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టానికి ఒక్క పథకమైనా అమలు చేసిందా అని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కైనా జాతీయ హోదాను తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమే కితాబునిస్తుందని కానీ ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం అర్ధంలేని విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలమవుతున్న మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, అమ్మ ఒడి పథకం, సాగు నీటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసం ఇష్టా రాజ్యంగా మాట్లాడటం నేర్చుకున్నారన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే అధికార పార్టీ దృష్టికి తీసుకు వచ్చి, పరిష్కార దిశగా అడుగులు వేయాలని కానీ, దళితుల కోసం అమలు చేసే పథకాల ను అడ్డుకుంటామంటే ప్రజలు ఊరుకోరని గుర్తు చేశారు.
అర్ధవంతమైన ఆరోపణలు చేస్తే స్వీకరిస్తామని, కానీ సీఎం కేసీఆర్, కేసీఆర్ కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తామంటే రాష్ట్రంలో ఉన్న 60 లక్షల టీఆర్ఎస్ సభ్యులు చూస్తూ ఊరుకో రని అన్నారు. 7 ఏండ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భరీ చేశామని త్వరలో మరో 50 నుంచి 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈటల ఓటమి భయంలో అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు. గెల్లు శ్రీనివాస్ను బానిసగా వర్ణించిన ఈటల వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రికి మహార్ధశ పట్టుకుందని త్వరలో గ్రామం మహాద్భుతంగా మారబోతుందని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పనిచేసిన యువతను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని అభివర్ణించారు. విద్యార్ధి నాయకులు బాల్క సుమన్, గాదరి కిశోర్కుమార్తో పాటు యువకుడు నోముల భగత్కు గొప్ప హోదాలను కట్టబెట్టారని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సైతం ఉద్యమ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారని అన్నారు. అభివృద్ధికి బాటలు వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేముందు 60 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, 7 ఏండ్లుగా అధికారంలో ఉంటున్న బీజేపీ ఏమీ చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ఒక్కనాడైన హుజురాబాద్లో అడుగుపెట్టని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్కడి ప్రజలను ఓట్లు అడిగే అర్హతలేదన్నారు.
మంత్రికి స్వాగతం పలికినవారిలో ఆలయ ఈవో ఎన్. గీత, ఆర్డీవో భూపాల్రెడ్డి, ఏఈవోలు గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ భీకూనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, విద్యార్థి నాయకుడు బాలరాజుయాదవ్, నాయకులు మిట్ట వెంకటయ్య, ఆకుల శ్రీనివాస్యాదవ్, ఎరుకల హేమేందర్గౌడ్, కసావు శ్రీనివాస్ గౌడ్, పేరబోయిన సత్యనారాయణ, ముఖ్యర్ల సతీశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.