రూ.5 లక్షల అపహరణ
చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
నగదు స్వాధీనం..ఇద్దరి నిందుతుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల రూరల్, మే 1: అవసరముందని అడిగితే అప్పిచ్చారు. ఆ తర్వాత వారే ఇచ్చిన డబ్బును కాజేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం వివరాలు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన రాగుల రమేశ్ బోయినపల్లి పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సిరిసిల్లలోని అంబికానగర్లో నివసిస్తున్నాడు. రమేశ్కు బస్వాపూర్కు చెందిన పొన్నం శేఖర్ వరుసకు బావ. వీరికి బస్వాపూర్కు చెందిన పుర్మాణి ప్రశాంత్రెడ్డి స్నేహితుడు. శేఖర్ హైదరాబాద్లోని మద్యం దుకాణంలో క్యాషియర్గా, ప్రశాంత్ ఊరిలోనే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరు అంబికానగర్లోని రమేశ్ నివాసంలో దావత్లు చేసుకుంటారు. ఈ క్రమంలో రమేశ్ తన ఊరిలోని బంధువు ఇల్లు అమ్మకానికి పెట్టగా, దానిని కొనే ఉద్దేశంతో తన బావ శేఖర్ వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు.
ఈ డబ్బును ఏప్రిల్ 25న ఉదయం రమేశ్ తన ఇంటిలోని బీరువాలో పెట్టి, బస్వాపూర్కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న శేఖర్ రమేశ్కు ఇచ్చిన నగదును కాజేయాలని పథకం పన్నాడు. స్నేహితుడు ప్రశాంత్కు ఫోన్ చేశాడు. రమేశ్ ఉంటున్న ఇంటికి వెళ్లి నగదును అపహరించాలని సూచించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ రమేశ్ ఉంటున్న ఇంటి డోర్ను బలవంతంగా తెరిచి లోనికి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న నగదు దొంగిలించాడు. ఈ విషయం శేఖర్కు తెలియజేశాడు. శేఖర్, ప్రశాంత్ ఇద్దరు చెరి సమానం నగదును పంచుకున్నారు. వీరిద్దరూ శనివారం సిరిసిల్లకు రాగా, గాంధీనగర్లోని మార్కెట్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.5లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలిస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐలు అనిల్కుమార్, ఉపేందర్,ఎస్ఐ సుధాకర్, ఏఎస్ఐ శరత్, క్లూస్ టీం, కానిస్టేబుళ్లు పుల్కం శ్రీనివాస్, జగదీశ్, పోలీసు సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఉన్నారు.