హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాలంగా గొడవపడుతున్నాడు. దీంతో తన భర్త వేధిస్తున్నాడని వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో సాలి ఫిర్యాదు చేసింది. తనపై కేసు పెట్టడంతో ఆగ్రహంగా ఉన్న శ్రీను.. మంగళవారం రాత్రి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తండాలోని రామయ్య చెరువులో పడేశాడు.
అయితే బుధవారం ఉదయం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, సాలి మృతికి భర్త కారణమని ఆరోపిస్తు ఆమె తరఫు బంధువులు శ్రీను ఇంటిపై దాడిచేశారు. దీంతో ఇళ్లు ధ్వంసమయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.