హైదరాబాద్: రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, సిద్దిపేట, హైదరాబాద్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులకు సీతారామ చంద్రమూర్తి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ తల్లి కొలువుదీరారు. దీంతో ఆది దంపతుల దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో అధికారులు ఆలయంలో నిత్యకల్యాణాలను నిలిపివేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున తొలి పూజల అనంతరం స్వామివారు ఉత్తరద్వార దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి రెండు గంటలు పడుతున్నది.
ఇక ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నులపండువలా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామి వారు ఉత్తర ద్వార దర్శన మిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశికి పిలిచే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు.
ఆషాఢ శుద్ధ (తొలి) ఏకాదశి నాడు ‘జగద్రక్షణ చింతన’ యను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొని.. సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగాన్ని ఈ వైకుంఠ ఏకాదశినాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్తకాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం కావడంతో దీనికి ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా పేరు.