Arogya Mahila | హైదరాబాద్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. గడిచిన 20 మంగళవారాల్లో మొత్తం 1,85,492 మంది మహిళలు స్క్రీనింగ్ పూర్తి చేసుకొని సమగ్ర ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేయడం జరిగింది. వారానికి సగటు ఓపీ 65 నమోదు కాగా, క్లినిక్స్కు వచ్చిన 25 శాతం మంది మహిళలకు అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి 8న ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలుత 24 జిల్లాల్లో 100 ఆరోగ్య మహిళ క్లినిక్స్ ప్రారంభించగా, జూన్ 14 నుంచి మిగతా 9 జిల్లాల్లోని 172 కేంద్రాల్లో ప్రారంభమైంది. మొత్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 272 ఆరోగ్య మహిళ క్లినిక్స్ సేవలందిస్తున్నాయి. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ క్లినిక్స్ లో పూర్తిగా మహిళా వైద్యులు,మహిళాసిబ్బంది ఉండి సేవలు అందిస్తారు. 8 రకాల వైద్య పరీక్షలను అందించడం జరుగుతున్నది. వైద్య పరీక్షలు చేసి రోగనిర్ధారణ చేయడం, వైద్యం అందించడంతో పాటు, ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారు. మమ్మోగ్రాం, ఆల్ట్రాసౌండ్, కొలనోస్కోపీ, క్రియోథెరపీ, పాప్ స్మియర్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమైన వారికి చేస్తున్నారు.
ఓరల్ క్యాన్సర్ విషయంలో 1,42,868 మందిని పరీక్షంచగా, 859 మందికి సస్పెక్ట్ చేయడం జరిగింది. పరీక్షల అనంతరం ఐదుగురికి (0.6శాతం) నిర్ధారణ చేయడం జరిగింది. బ్రెస్ట్ కేన్సర్ విషయంలో 1,41,226 మందిని పరీక్షంచగా, 1,313 మందిలో లక్షణాలు గుర్తించడం జరిగింది. రోగనిర్ధారణ పరీక్షలు చేయగా 26 మందికి అంటే 2శాతం మందికి ఉన్నట్లు వెల్లడైంది. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో 33,579 మందిని పరీక్షంచగా, 1340 మందిలో లక్షణాలు గుర్తించడం జరిగింది. పరీక్షల అనంతరం 26 మందికి అంటే 1.9 శాతం మందికి పాజిటివ్ రావడం జరిగింది. క్యాన్సర్ పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళలకు అత్యున్నత వైద్యం అందించేందుకు ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేయడం జరిగింది.
మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మహిళ క్లినిక్స్ ప్రారంభించింది అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్య బారిన పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాలపై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక ఇంకొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు.మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అమలు చేస్తేన్న ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. మహిళలందరూ ఆరోగ్య మహిళ క్లినిక్స్ సద్వినియోగం చేసుకోవాలని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.