Minister Harish Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గతరెండు మంగళవారాల్లో 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈనెల 14న 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 975 మందికి అవసరమైన మందులు అందజేశారు. ఉన్నతస్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తరలించి వైద్యంసేవలు అందేలా చూస్తున్నారు.
ఈ నెల 21న 6,328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్ను సందర్శించారు. ఇందులో 3,753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్, 718 మందికి మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, 1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్, 477 మందికి విటమిన్ – డీ లోపం, 1294 మందికి సీబీపీ పరీక్షలు నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విధితమే. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1,200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం 100 అరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మహిళా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.