నమస్తే తెలంగాణ నెట్వర్క్: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. ర్యాలీలు, పటాకల మోతతో ఆత్మీయ సమ్మేళన ప్రాంగణాలు మార్మోగిపోతున్నాయి. ‘జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్’ నినాదాలతో హోరెత్తుతున్నాయి. కార్యకర్తలు తమ సమస్యలను నేతల ముందు ఏకరువు పెడుతున్నారు. వాటిని ఓపికగా వింటున్న నేతలు పరిష్కరిస్తామని హామీ ఇస్తుండటంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేతలు కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేస్తూ వారిలో జోష్ పెంచుతున్నారు. మంగళవారం కూడా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరిగాయి.
తెలంగాణ మాడల్ దేశానికి అవసరం..
తెలంగాణ మాడల్ అభివృద్ధి దేశానికి అవసరమని, అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్కు అప్పట్లో సిద్దిపేటలో ఇచ్చిన ధైర్యాన్నే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఇన్చార్జి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ప్రసంగించారు.
‘కేసీఆర్ పథకాలే’ బీఆర్ఎస్కు శ్రీరామరక్ష
తెలంగాణలో సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్మాడల్గా నిలిచిందని కొనియాడారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరు, దేవరుప్పుల గ్రామాల్లో చినమడూరు, కోలుకొండ, రాంభోజీగూడెం, రాంచంద్రాపురం, దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్పహడ్ గ్రామాల పరిధిలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఈ సమ్మేళనాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉషాదయాకర్రావు దంపతులు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పథకాలపై గ్రామాల్లో చర్చించాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను ఊరూరా చర్చించి ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పార్టీ జిల్లా ఇన్చార్జి కోలేటి దామోదర్గుప్తాతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వినోద్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమైందని, అదే మన బలగమన్నారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ‘నాడు నేడు’ సంచిక అద్భుతంగా ఉన్నదని కొనియాడారు.
దేశంలో అగ్రగామి తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రజాదరణ పొందుతున్నదని, ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. సమావేశంలో జిల్లా ఇంచార్జి వీజీ గౌడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట గులాబీమయం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం గులాబీమయమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని పాత గోశాల నుంచి గిరిజన సంప్రదాయ నృత్యాలు, పటాకల మోతలతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పార్టీ శ్రేణులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి