హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ఈ విధానంలో దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) లాంటి ఆధునిక సాంకేతికతలతో దరఖాస్తులను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 76 శాతానికిపైగా అనుమతులు ఇచ్చేశారు. సాంకేతిక కారణాల రీత్యా కొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో ఇండ్ల యజమానుల్లో మరింత అవగాహన తీసుకొచ్చి అనుమతుల శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దరఖాస్తు విధానం, అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయడంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం 1800 599 2266 టోల్ఫ్రీ నంబర్, 040-22666666 మొబైల్ నంబర్, ts-bpass-support@telangana.gov.in. ఈ-మొయిల్ను ఏర్పాటు చేయడంతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా సేవలు అందించేందుకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లను ఓపెన్ చేశారు. టీఎస్బీపాస్ ద్వారా ల్యాండ్ యూజ్ సర్టిఫిట్లను జారీచేయడంతోపాటు దరఖాస్తులను పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా ఆమోదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా ప్రభావం, ఇతర కారణాల వల్ల గత ఏడాది ఇండ్ల నిర్మాణాలు తగ్గినప్పటికీ ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతున్నది. టీఎస్బీపాస్కు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఏకంగా 51,072 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఇదే కాలంలో 24,799గా ఉన్న దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 106% పెరిగింది. మార్చిలో అత్యధికంగా 9,455 దరఖాస్తులు అందాయి. 2021 జూలై తర్వాత నుంచి దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో 26,892, హెచ్ఎండీఏ పరిధిలో 38,696, డీటీసీపీ పరిధిలో 60,321 వచ్చాయి.
రాష్ట్రంలో టీఎస్బీపాస్ ప్రారంభమైన నాటినుంచి నేటివరకు 1,29,011 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 57,034 దరఖాస్తులు (దాదాపు 45%) రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నుంచే వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 28,549, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి 28,485 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాతి స్థానాల్లో హనుమకొండ (7,085), సంగారెడ్డి (5,921), హైదారాబాద్ (5,381) ఉన్నాయి. ఈ జాబితాలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేవలం 328 దరఖాస్తులతో చిట్టచివరన నిలిచింది. ఈ జిల్లా కంటే ముందు జయశంకర్ భూపాలపల్లి (430), వరంగల్ (515), కొత్తగూడెం నుంచి (629), జనగామ (833) జిల్లాలు ఉన్నాయి.