CM KCR | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గత పాలకులు తెలంగాణలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విద్యపై విరివిగా ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. విద్యపై వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నది. విద్యార్థులు ప్రయోజకులైతే అదే పెట్టుబడి మానవ వనరుల రూపంలో తిరిగి రాష్ర్టాభివృద్ధికి దోహదపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. ఇంటర్, కళాశాల విద్యకు 2014-15 సంవత్సరంలో కేవలం 1,227 కోట్లు మాత్రమే వెచ్చించగా, 2022 -23 నాటికి ఈ మొత్తం రూ.1,962 కోట్లకు పెంచింది. సాంకేతిక విద్యకు సైతం భారీగా కేటాయింపులు చేసింది. ఈ 9 ఏండ్ల కాలంలో కళాశాల, ఇంటర్ విద్యకు మొత్తంగా రూ. 14వేల కోట్లు, సాంకేతిక విద్యకు రూ. 3,415కోట్ల చొప్పున మొత్తంగా 17వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించింది.
రాష్ట్రంలో 410 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 193 డిగ్రీ కళాశాలలు, 60 వరకు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకులాల్లో ఇంటర్ విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థులంతా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఉన్నత విద్యను బలోపేతం చేసింది. ఫలితంగా ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) జాతీయస్థాయిలో 27.3 శాతంగా ఉంటే రాష్ట్రంలో జీఈఆర్ 36.2 శాతంగా ఉంది. ‘దోస్త్’ ద్వారా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోను రిజర్వేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. విద్య విషయంలో రాష్ట్ర ప్రభు త్వం చూపుతున్న శ్రద్ధ కారణంగా 92 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపును దక్కించుకున్నాయి. మరో 96 కాలేజీలు ఐఎస్వో గుర్తింపును సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వ చొరవతో పాలిటెక్నిక్ కాలేజీలు సైతం ప్రగతిపథంలో సాగుతున్నాయి. 51 డిప్లొమా కోర్సులు ఎన్బీఏ గుర్తింపును దక్కించుకోవడం విశేషం.
వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించింది. బ్లాక్ గ్రాంట్ నిధులకు ఇవి అదనం. 2004 తర్వాత ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో పలు వర్సిటీలను కొత్తగా ప్రారంభించినప్పటికీ వసతుల కల్పనను గాలికొదిలేసింది. దీంతో భవనాలు, హాస్టళ్లు లేక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి ముగింపు పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం వర్సిటీలకు భారీగా నిధులు కేటాయించింది. బ్లాక్ గ్రాంట్ నిధులను సైతం భారీగా పెంచింది. ఉస్మానియాకు 2010-11లో ఉమ్మడి ప్రభుత్వం రూ.93కోట్లు నిధులు మాత్రమే కేటాయించగా, 2014 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రూ.219.24 కోట్లకు పెంచింది. 2022-23 బడ్జెట్లో రూ.418.06 కోట్లకు, 2023-24లో రూ. 457.10 కోట్లకు పెంచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2009 -10లో ఉమ్మడి ప్రభుత్వం విదిల్చింది రూ. 7.07 కోట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం 2018-19లో రూ. 10.45 కోట్లు కేటాయించగా, 2023 -24లో రూ. 18.96 కోట్లను కేటాయించింది.