ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లను దాటుకుంటూ ప్రవహించగా.. ఉధృతికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగపేట మండలం వద్ద నది ప్రవాహం పెరిగి బోర్నర్సాపురం గ్రామం వద్ద ఉన్న కరకట్టకు గండి పడింది. దీంతో నీరు గ్రామ పరిసర ప్రాంతాలకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది.
చండ్రుపల్లి, నగేపల్లి, మద్దులపల్లి, పలుగులు, కుంట్లం, పుస్కుపల్లి గ్రామాలు బ్యాక్ వాటర్తో నిండిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ సాయంతో దాదాపు 300 మంది పుస్కుపల్లి గ్రామస్తులను సురక్షితంగా కాళేశ్వరంలోని పునరావాస కేంద్రాలకు తరలించాయి. 1986లో వచ్చిన గోదావరి వరదలు ఇప్పుడు మళ్లీ వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. వరదలతోపాటు భారీ వర్షాల నేపథ్యంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏటూరునాగారంలోనే బస చేసి ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. గురువారం కన్నాయిగూడెం మండలంలో పర్యటించిన కలెక్టర్, పీవో వరద పరిస్థితులను తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేశారు. కాళేశ్వరం వద్ద ఉధృతంగా పారుతున్న గోదావరిని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, అడిషనల్ కలెక్టర్ దివాకర్ పరిశీలించారు.