హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద (Floods) వచ్చిచేరుతున్నది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరాంసారగ్ ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1078.70 అడుగులు. ఇప్పుడు 1091 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో 90 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం 49 టీఎంసీల నీరు ఉంది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులకు జలకళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 95 చెరువులు అలుగుపోస్తున్నాయి. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 5980 క్యూసెక్కుల నీరు వస్తున్నది. సాగర్ పూర్తినీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుత 1329 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయంలో 17.802 టీఎంసీలను నీరు నిల్వ ఉంచవచ్చు. ఇప్పుటు 5.474 టీఎంసీల నీరు ఉంది.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 59,716 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 23,297 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో 20 గేట్లు ఎత్తి 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు. ప్రస్తుతం 15.05 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.