వేములవాడ కల్చరల్ : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు
పోటెత్తారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు
తరలివచ్చారు. వేకువ జాము నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆలయం ఎదుట ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) భక్తులకు పంచిపెట్టారు.
ఆలయ కళాభవన్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు పాల్గొన్నారు. అభిషేకం, అన్న పూజలు, కల్యాణ మొక్కులు, గండాదీపం మొక్కులు, సత్యనారాయణ వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 60వేల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారని అంచనా. వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.28లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్ల అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్ పోలీస్ బందోబస్తు కల్పించారు.