రాజన్న సిరిసిల్ల : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయం శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శించుకున్నారు. వేకవజామునే భక్తులు పవిత్ర ధర్మ గుండంలో స్థానాలు ఆచరించి రాజన్నకు ప్రీతి మొక్కైన కోడెమొక్కు తీర్చుకున్నారు.
ఉదయం నుంచి 11 గంటల వరకు వర్షం కురిసినప్పటికినీ క్యూలైన్లలో బారులు తీరి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు ఆలయ అధికారులు 11 గంటల తర్వాత అనుమతించారు. దీంతో భక్తులుఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు భాగంలో గల కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించుకొని, తామెత్తు బెల్లాన్ని జోకించి భక్తులకు పంచిపెట్టారు.
ఆలయంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గండ దీపము మొక్కులు, కుంకుమార్చనలు, కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హోమాలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాజన్నను 12 గంటల వరకే సుమారు 35 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని రాజన్నకు 12 గంటల వరకు సుమారు 18 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తులు అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగేశ్వరాలయాల వద్ద భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.