హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్టు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నదని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ రెండు రోజుల క్రితం క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెప్తున్నదని, జనాభాను తకువ చేసి చూపాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు. ఇంతవరకు కచ్చితమైన డాటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. 2011 జనాభా లెకలు అందుబాటులో ఉన్నాయని, అంతర్జాతీయంగా, దేశీయంగా పదేండ్లలో సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్న అంచనా ఉన్నదని తెలిపారు. ఆ లెకన ఇప్పుడు తెలంగాణ జనాభా 4 కోట్ల 18 లక్షలు ఉండాలని చెప్పారు. తమ ఇండ్లకు సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. మరోసారి వారి వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.