ధర్మపురి, జూన్ 8: హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్హెచ్ గార్డెన్స్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సభ్యత్వ నమోదు ఇన్చార్జి విజయారెడ్డితో కలిసి ధర్మపురి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా జీవన్రెడ్డి మాట్లాడారు.
రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులను గాలికొదిలేశారని మండిపడ్డారు. సంప్రదింపుల కోసం పక్కరాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ దొరకడం లేదని రేవంత్రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కనుసన్నల్లోనే జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఒక్క ధర్మపురిలోనే బీఆర్ ఎస్ నేతలపై 60 కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.