మహబూబ్నగర్ కలెక్టరేట్, ఆగస్టు 17 : ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేశారు. గత జూన్ 25 నుంచి ఈ నెల 10 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ చేశారు. ఎన్యూరేషన్ ఫారాలు అందించి వాటిలో వివరాలు పూరించి ఇచ్చిన వాటిని డిజిటలైజేషన్ చేశారు.
ఇందులో భాగంగా 1,03,086 ఓట్లు తొలగించారు. మిగతా ఓటర్ల వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను వెల్లడించారు. మ్యాపింగ్ కానివారు, అక్షర దోషాలు కలిగిన (అనామలీస్) ఓటర్లకు ఈఆర్వోలు నోటీసు జారీ చేయనున్నారు. వీరు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో కావాల్సిన వాటిని సమర్పించి ఓటు హక్కు పునరుద్దరించుకునే వీలుంది.
జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ప్రతి ఒక్కరూ తమ పేరుందో లేదో చూసుకోవచ్చు. అభ్యంతరాలను వచ్చే నెల 16 వరకు బీఎల్వోలు, తాసీల్దార్లు, ఈఆర్వోలకు అందించవచ్చు. ఇదే సమయంలో ఫారం-6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు అందించవచ్చు. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 7,32,488 మంది ఉండగా వారిలో 5,89,284 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ పూర్తయ్యింది. 40,116 మంది ఓటర్ల వివరాలు మ్యా పింగ్ కాలేదు. 17,348 మంది చనిపోయారు. 55,086 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 14,372 మంది ఆల్రెడీ ఎన్రోల్ కాగా, 15,396 మంది అందుబాటులో లేకుండా పోయారు. 884 మంది ఓటర్లు రెఫ్యూజల్ అయ్యారు. ఈ లెక్కన మొత్తం 1,03, 086 పేర్లు జిల్లా జాబితా నుంచి ఔట్ అయ్యాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ముందు మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2,64,235 మంది ఓటర్లు ఉండగా సర్ ప్రక్రియ తర్వాత ఆ సంఖ్య 2,13,588 కి చేరింది. జడ్చర్ల నియోజకవర్గంలో సర్కు ముందు 2,25,911 మంది ఓటర్లు ఉండగా సర్ తర్వాత 1,99,354కు చేరింది. దేవరకద్ర నియోజకవర్గంలో సర్కు ముందు 2,42,342 మంది ఓటర్లు ఉండగా సర్ ప్రక్రియ తర్వాత ఆ సంఖ్య 2,16,460కి చేరింది.