హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ఇండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాల కంటే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యం గా దేశ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబై కంటే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యయం దాదాపు 14 శాతం తక్కువగా ఉన్న ట్టు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థ జేఎల్ఎల్ గతంలోనే స్పష్టం చేసింది. హైరైజ్ బిల్డింగ్స్లో లగ్జరీ రెసిడెన్షియల్ అపార్టుమెంట్ ధర ముంబైలో చదరపు అడుగుకు రూ.5,625గా, హైదరాబాద్ లో రూ.4,275గా ఉన్నట్టు వెల్లడించింది. ఇత ర మెట్రోనగరాలైన న్యూఢిల్లీ, బెంగళూరు, పు ణెతో పోల్చినా హైదరాబాద్లోనే భవన నిర్మా ణ ధరలు తక్కువగా ఉన్నట్టు తన అధ్యయన నివేదికలో పేర్కొన్నది. మీడియం సైజ్ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి ముంబైలో చదరపు అడుగుకు రూ.3,250, ఢిల్లీలో రూ. 2,860, హైదరాబాద్లో రూ.2,470 చొప్పు న ఖర్చవుతున్నట్టు వివరించింది. స్థానిక పరిస్థితులతోపాటు కార్మికలు, భవన నిర్మాణ సామాగ్రి లభ్యత, వాటిని కొనుగోలు చేసే విధానం, బిల్డర్ల ప్రమేయం తదితర అంశాలు ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
అందుబాటులో ఇంజినీర్లు, కార్మికులు
నిపుణులైన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్లు, మేస్త్రీలు, కూలీల లభ్యత కూడా నిర్మాణ రంగానికి ఎంతో కీలకం. ఈ విషయంలో ముంబై కంటే హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉన్నది. వారికి ఇచ్చే వేతనాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉండటంతో ఇక్కడ ఇంజినీర్లు, కూలీలు విస్తృతంగా అందుబాటులో ఉంటున్నారు. ఒక్కో సైటు వద్ద నిత్యం వందలాది మంది పనిచేస్తున్నారు. దీంతో పనులు వేగంగా పూర్తవడంతోపాటు నిర్మాణ వ్యయం తగ్గుతున్నది.
మధ్యవర్తులకు చెక్
ఇండ్ల నిర్మాణాలకు స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర, మట్టి, టైల్స్, రంగులు, కలప, మార్బుల్స్, గ్రానైట్స్ తదితర వస్తువులను ఉపయోగించాల్సి ఉంటుంది. హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు మొదలుకొని వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాల వరకు వాటి బిల్డర్లు, యజమానులే ఈ వస్తువులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంటారు. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతున్నది. కానీ, ముంబైలో బిల్డర్లు తమ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను టోకుగా ఇతర సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ కంటే ముంబైలో భవన నిర్మాణ వ్యయం 14 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.