హైదరాబాద్: రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్లోని బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని హోం మంత్రి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదంలో 11 మంది మరణించారని చెప్పారు. మృత దేహాలను గాంధీ దవాఖానకు తరలించామని, అక్కడ వాటి గుర్తింపు జరుగుతున్నదని తెలిపారు.
ఇప్పటికే ఆరు మృతదేహాల గుర్తింపు పూర్తయిందని, ఐదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. వారి మృతదేహాలను ఎయిర్ అంబులెన్స్లో స్వస్థలాలకు పంపిస్తామన్నారు. బుధవవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ, అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గోదాముల ఘటనపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. నగరంలోని గోదాముల రక్షణ చర్యలపై చర్చిస్తామని చెప్పారు.