హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్న నేతలు చర్చకు రావాలని హోంమంత్రి మహమూద్అలీ సవాల్ విసిరారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పొంతనలేని ఆరోపణలు చేస్తూ.. ముస్లిం, మైనార్టీలను తప్పుదోవ పట్టించే నాయకులకు దమ్ముంటే చర్చకు రావాలని, ఖురాన్పై ప్రమాణం చేద్దామని, వస్తారా? అని ప్రశ్నించారు.
శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాలో ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ముస్లింల కోసమే రూ.10,139.11 కోట్లను ఖర్చు చేసిందని, ఈ తరహా ముస్లింల సంక్షేమాన్ని కాంక్షించిన రాష్ట్రం, పార్టీ మన దేశంలో ఏదైనా ఉందా? అని హోంమంత్రి మహమూద్ అలీ ప్రశ్నించారు. ముస్లింలైనా, ముస్లిమేతురులైనా మసీదులను ధ్వంసం చేస్తే వెంటనే కేసులు పెట్టామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే మూతపడిన మైనార్టీ ఇంజినీరింగ్ కాలేజీలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.
చారిత్రక ముస్లిం కట్టడాలను కూల్చివేశారని అబద్ధాలు వల్లవేస్తున్న కాంగ్రెస్ నాయకులు నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు. నేటికీ ఉస్మానియా, ఎర్రమ్ మంజిల్, నిజామియా మెడికల్ కాలేజీ, మెటర్నిటీ హాస్పిటల్, ఉస్మాన్సాగర్, సఖల్సాగర్ చెక్కు చెదరకుండా ప్రభుత్వమే ప్యాచ్వర్క్లు చేస్తూ కాపాడుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ 2 కోట్లు.. బీఆర్ఎస్ 10 వేల కోట్లు
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కోసం కేవలం రూ.2,219 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఈ విషయాన్ని ముస్లిం, మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలని హోంమంత్రి హితవు పలికారు. బీఆర్ఎస్ 2023-24 బడ్జెట్లో రూ.2,200 కోట్లు కేటాయించిందని చెప్పారు. పొంతనలేని ఆరోపణలు చేస్తూ.. ముస్లిం, మైనార్టీలను తప్పుదోవ పట్టించే నాయకులకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, హజ్యాత్ర, దర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని, ప్రతిపక్షాల ఆరోపణలను మైనార్టీ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, బీఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, అర్షద్అలీఖాన్, మునీర్భాయ్, షరీఫుద్దీన్ పాల్గొన్నారు.