హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మోదీ ఇస్తున్నరు.. కేంద్రమే ఇస్తున్నది.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడిన మాటలివి.. ఎనిమిదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చామని బహిరంగ సభలో గప్పాలు కొట్టారు అమిత్షా. రాష్ర్టానికి అమిత్షా కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన ప్రియమిత్రుడు ప్రధాని మోదీ కానీ చేసిన మెహర్బానీ ఏమిటో అర్థం కాదు. తెలంగాణ భారీ ఎత్తున కప్పం కడితే.. అందులో సగం కూడా రాష్ర్టానికి తిరిగి రాలేదు. తెలంగాణ పన్నులతో యూపీ, గుజరాత్ వంటి రాష్ర్టాలు పబ్బం గడుపుకొంటున్నాయి. వాస్తవాలన్నీ పక్కనపెట్టి.. స్థానిక నేతలిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోవడం కేంద్ర హోం మంత్రి అవగాహనారాహిత్యానికి నిదర్శనం.
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హామీ నెరవేర్చలేదు
తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఏడున్నరేండ్లలోనే 12 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో మరో 8 కాలేజీల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. మిగ తా 8 కాలేజీలు వచ్చే ఏడాదిలో వస్తున్నాయి. ఈ కాలేజీలకు అనుసంధానంగా ఏర్పడే వైద్యశాలలతో ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రమే సొంతంగా ఏర్పాటు చేస్తున్నది. మోదీ ప్రభుత్వం దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే.. రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేసింది.
అమిత్ షా అబద్ధం: హైదరాబాద్లో నాలుగు టిమ్స్ ఏర్పాటు ఏమైంది?
వాస్తవం: అల్వాల్, సనత్నగర్, ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటళ్ల ఏర్పాటును ప్రకటించే నెలలు కాలేదు. వెంటవెంటనే కార్యాచరణకు పూనుకొని ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.2,679 కోట్లతో టెండర్లు పిలిచారు. గచ్చిబౌలి టిమ్స్, నిమ్స్లో అదనంగా 2 వేల పడకలకు త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. షాకు కనీస అవగాహన లేదనడానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి?
అమిత్ షా అబద్ధం: ఉస్మానియా, గాంధీ దవాఖానలను దిగజార్చారు.
వాస్తవం: తెలంగాణ ఏర్పడేనాటికి ఉస్మానియా, గాంధీ దవాఖానలు అధ్వాన స్థితిలో ఉండేవి. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయా దవాఖానల్లో పర్యటించి, రూ.వందల కోట్లు వెచ్చించి దవాఖానలను, యంత్రాలను, పరికరాలను ఆధునీకరించారు. కరోనా విపత్తు సమయంలో గాంధీ, ఉస్మానియా దవాఖానలు లక్షల మందిని కాపాడగలిగాయి.
అమిత్ షా అబద్ధం: ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదు.
వాస్తవం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుకోసం గత ఏడాది మేలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం చేసుకున్నది. అప్పటి నుంచి ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు.
అమిత్ షా అబద్ధం: టీచర్లు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడం లేదు.
వాస్తవం: ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఈసారి మరో 8 వేల పోస్టుల భర్తీకి సిద్ధమైంది. దాదాపు నాలుగువేల అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు కేంద్రం విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూళ్లను రేషనలైజేషన్ చేయాలని చెప్తున్నది. మరోవైపు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఇదేం పద్ధతి?
అమిత్ షా అబద్ధాలు: నరేంద్రమోదీ తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చారు.
వాస్తవం: రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఇప్పటివరకు రూ.3.6 లక్షల కోట్లు వెళ్తే.. కేంద్రం నుంచి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. అమిత్షా మాత్రం రూ.90 వేల కోట్లు అదనంగా ఇచ్చినట్టు తెలిపారు.
అమిత్ షా అబద్ధం: మిషన్ భగీరథ కోసం రూ.50 కోట్లు ఇచ్చాం.
వాస్తవం: ‘ఇత్తేసి పొత్తు కూడటం అంటే ఇదే’.. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.46 వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథను అమలు చేసింది. ఇందులో కేంద్రం ఇచ్చిన రూ.50 కోట్లు ఎంత?. 0.1 శాతం మాత్రమే. మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వందల సార్లు విన్నవించినా ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వాస్తవం కాదా?
వాళ్లు చెప్పేవి అబద్ధాలు.. వాళ్ల పార్టీ ఝూటా పార్టీ. కనీసం ఆ ఇద్దరు కేంద్రమంత్రులు చెప్పే మాటలు ఒకే తీరుగా చెప్పి ఉంటే డౌటైనా రాకపోయేది. కానీ, సంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకే అంశంపై ఒక్కో తీరుగా చెప్పి ప్రజల ముందు తేలిపోయారు. ‘నరేగా’కు రూ.18 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్తే, రూ.30 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి చెప్పారు. వీరిద్దరు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియో చూసినవాళ్లంతా హవ్వ! ఇవ్వేం అబద్ధాలు అంటూ మండిపడుతున్నారు.
అధికారం కోసం బీజేపీ నాయకులు ఎంతలా అర్రులు చాస్తున్నారనేది తుక్కుగూడ సభలో స్పష్టమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ‘ఒక్కసారి అవకాశమివ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్..’ అంటూ జనాన్ని వేడుకున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడం ఖాయమని, తాము అధికారంలోకి రావడమే మిగిలిందన్నట్లుగా అమిత్షా సైతం మాట్లాడటం విడ్డూరం.
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ను గద్దె దిగాలంటూ అమిత్షా డిమాండ్ చేయడం నవ్వులపాలైంది. అన్ని రంగాల్లో విఫలమైందన్న విమర్శలను మూటగట్టుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం శాతగానమ్మ శాపెనలు పెట్టిందన్నట్టుగా ఉంది. కశ్మీర్ పండిట్ల ఆందోళన, పెరిగిన ధరలు, అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం.. బీజేపీ చేతగాని తనానికి నిదర్శనమని, గద్దె దిగాల్సింది ఎవరో దీంతోనే అర్థమవుతున్నదని నెటిజనులు మండిపడుతున్నారు.