తాడ్వాయి, డిసెంబర్ 16: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న దేవునిగుట్టపై టఫోనీల (తేనెటీగల గూడులాంటి గుహలు)ను కనుగొన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన అక్కడి పరిసరాలను సందర్శించి మాట్లాడారు. ఇసుక రాతి శిలలతో ఏర్పడిన దేవునిగుట్ట పైభాగంలో ఆదిమానవులు వేసిన చిత్రాలతో కూడిన గుహలున్నాయని, వాటి దిగువ భాగాన సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ కుహరాల సమూహాన్ని గుర్తించామని తెలిపారు. ఇవి చూడటానికి ఆసక్తికరంగా, సుందరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. వీటిని భూగర్భ శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లి మరింత పరిశోధన చేయగా.. ఇలాంటి సహజసిద్ధ నిర్మాణాలు సాధారణంగా ఎడారి, సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయని, ఇంతకుముందు జోధ్పూర్, అజ్మీర్లో గుర్తించారని చెప్పారు.
తెలంగాణలో వీటిని గుర్తించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఇవి ప్లీస్టోసీన్ (హిమనీనదీయ కాలం. దాదాపు 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమై, 11 వేల ఏండ్ల క్రితం ముగిసిన కాలం) యుగానికి చెందినవని చెప్పారు. అంటే.. దాదాపు 20 వేల నుంచి 50 వేల ఏండ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చునని అంచనా వేశామని పేర్కొన్నారు. అర్ధకుష్క (అర్ధ మెట్ట ప్రాంతం)గా ఉన్న తెలంగాణ కుష్క (పూర్తి పొడిబారిన) ప్రాంతంగా మారనుందనే ప్రకృతి హెచ్చరికకు సంకేతంగా వీటిని భావించవచ్చునని వివరించారు. టఫోనీల ఆధారంగా దట్టమైన అడవి కూడా పలుచబడి ముళ్లజాతి మొక్కలతో పొదలుగా మారే ప్రమాదముందని గుర్తించవచ్చునని చెప్పారు.
సగటు వర్షపాతం తగ్గి నేల పొడిబారడమే కాకుండా గాలి కూడా పొడిబారి (తేమలేకుండా) ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు. ఇలాంటి ప్రకృతి హెచ్చరికలను ప్రభుత్వం గుర్తించి అడవులను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని సూచించారు. చరిత్ర పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులు, భూగర్భ శాస్త్ర విద్యార్థులకు టఫోనీల కారణంగా దేవునిగుట్ట పరిశోధన కేంద్రంగా మారనుందని వెల్లడించారు.