చిట్యాల, మార్చి 28 : గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన మట్టి కోసం గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలో గుట్టలపై ఉన్న చెట్లు నరికి, గుట్టలను తోడేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం వరంగల్-మంచిర్యాల రహదారిని మంజూరు చేసింది. దీంతో చిట్యాల, టేకుమట్ల మండలాల్లో కాల్వపల్లి, గిద్దెముత్తారం, పంగిడిపల్లి, రామకృష్ణాపూర్(టీ), అంకుషాపూర్, నవాబుపేట శివార్లలో రహదారి పనులు 3నెలల క్రితం ప్రారంభమయ్యాయి.
రోడ్డు నిర్మాణ పనులకు మట్టి అవసరం ఏర్పడటంతో గుట్టల్లోకి భారీ యంత్రా లు, జేసీబీలు దిగుతున్నాయి. కలపతోపాటు మట్టిని అడ్డూఅదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్నారని రైతులు చెప్తున్నా రు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు కొందరు గుట్టల మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.