హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యధిక పారితోషికం, వేతనాలు అందిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారి వేతనం రూ. వెయ్యిలోపే ఉండేది. అది కూడా సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడేవారు. జీతాలు పెంచాలని నిరసనలు చేస్తే కఠినంగా వ్యవహరించేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్కు ఆశాలను ఆహ్వానించారు. వారితో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు.
ఆశా వరర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,900 వేతనం అందిస్తున్నది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.4,500 మాత్రమే ఇస్తుండగా, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో రూ.5700, పొరుగున ఉన్న కర్ణాటకలో రూ.4 వేలు, ఛత్తీస్గఢ్లో రూ.5,250 ఇస్తున్నారు. ప్రతి ఆశాకు కేసీఆర్ ప్రభుత్వం రూ.7,848 విలువ చేసే స్మార్ట్ ఫోన్ను అందించింది. ఇప్పుడు ప్రతి నెల బిల్లును కూడా కడుతున్నది. ఏటా రెండు చీరలు పంపిణీ చేస్తున్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,198 మంది ఏఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. 2014-15లో వీరి వేతనం రూ.10వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ. 27,300 అందుకుంటున్నారు. గతంలో జీవో 510 ద్వారా ఏకంగా 58 శాతం వేతనాలు పెండంతో. రూ.12వేల నుంచి రూ.21వేలకు పెరిగింది. 2021లో జీవో నెంబర్ 730 ద్వారా ప్రభుత్వం మరో 30శాతం వేతనం పెంచడంతో అది 27,300కు చేరుకుంది. తద్వారా దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఏఎన్ఎంలకు గరిష్ఠంగా ఇస్తున్నది రూ.17వేలు మాత్రమే. ఏపీలో రూ.23,393, కర్ణాటకలో రూ.18,523, తమిళనాడులో రూ.18వేలు మాత్రమే ఇస్తున్నారు.
రాష్ట్రంలో ఏఎన్ఎంలకు వేతనం పెంచడంతోపాటు ప్రజల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసుకునేందుకు వీలుగా ట్యాబ్స్ను కూడా పంపిణీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్న 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎఎన్ఎంలకు ప్రత్యేక అవకాశం కల్పించింది. వీరికి గరిష్టంగా 20 మారులు వెయిటేజీని కల్పించింది. పని చేసిన ప్రతి ఆరునెలల కాలానికి 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇవ్వగా, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇవ్వడంతో వారికి ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి. ఏఎన్ఎంల సంఘాల వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను ఇంగ్లీష్ తో పాటు, తెలుగులోనూ నిర్వహించాలని నిర్ణయించింది. ఇలా ఆరోగ్య తెలంగాణవైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర పోషిస్తున్న ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది.
ఆశాలు, ఏఎన్ఎంల పారితోషికం, సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా నిలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,160 మంది ఆశాలు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి వారి వేతనం రూ.2 వేలు మాత్రమే. ఇప్పుడు రూ.9,900 అందుకుంటున్నారు. తొమ్మిదేండ్లలో 4సార్లు ప్రభుత్వం వారి వేతనాలను పెంచింది. ఇందులో కేంద్రం వాటా కేవలం రూ.1800 మాత్రమే కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8,100. అంటే కేంద్రం ఇచ్చేదానికి అదనంగా నాలుగు రెట్లు ప్రభుత్వం భరిస్తున్నది.