టేకులపల్లి, మార్చి 20: వైన్షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండల కేంద్రంలో మొత్తం నాలుగు వైన్ షాపులు ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. కొందరు గ్రామస్థులు వైన్స్కు వెళ్లారు. నాలుగు దుకాణాల్లో సిబ్బంది ఒక్కో క్వార్టర్పై రూ.20 నుంచి రూ.30 వరకు అధికంగా వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
యాజమాన్యాలు బ్రాండెడ్ మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని, దొరికే మద్యాన్నైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వైన్షాపుల వద్ద పరిస్థితి ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారుల ఆగ్రహావేశాలతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇదే అదునుగా భావించిన గ్రామస్థులు నాలుగు షాపుల్లో సుమారు రూ.40 లక్షల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. కొందరు ఒకటి రెండు సీసాలను తీసుకెళ్లగా మరికొందరు కాటన్ల కొద్దీ తమ ఇండ్లకు తరలించారు. సమాచారం అందుకున్న టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్, ఇల్లెందు సీఐ కరుణాకర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. వైన్ షాపుల యాజమాన్యాల ఫిర్యాదుల మేరకు విచారణ ప్రారంభించారు.