Mulugu | హైదరాబాద్/ములుగు, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల మంది పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు సమాచారం. కర్రెగుట్టలపై బాంబులు అమర్చామని, ఆదివాసీలు రావొద్దని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో.. ‘బచావో కర్రెగుట్టలు’ పేరు తో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల ఛత్తీస్గఢ్లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులంతా తలదాచుకునేందుకు కర్రెగుట్టల్లోకి వచ్చారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలతో వారి కోసం అణువణువు జల్లెడ పడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా వాజేడు, వెంకటాపురం (నూగూరు), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వైపుగా ఉన్న కర్రెగుట్టల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పోలీసు బలగాలకు కొరకరాని కొయ్యగా మారిన మోస్ట్వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళం కర్రెగుట్టల్లో ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్టు తెలుస్తున్నది. పోలీసుల హిట్లిస్టులో మొదటి వరుసలో ఉన్న హిడ్మాను లక్ష్యంగా చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కూంబింగ్ చర్యకు దిగినట్టు సమాచారం.
మంగళవారం ఉదయం ఊసూర్ బ్లాక్లోని కర్రెగుట్ట సమీపంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం.
కర్రెగుట్టల్లో పోలీస్ బలగాలు భారీగా మోహరించడంతోపాటు భద్రతా బలగాల వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయని, ఈ కాల్పులను వెంటనే ఆపాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఒక వీడియోను విడుదల చేశారు. ఒకవైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమని పేర్కొన్నారు.
మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని, సత్వరమే కేంద్రం వారితో శాంతి చర్చలు జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు, కర్రెగుట్ట ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరింపును నిలిపివేయాలని కోరారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని బీఆర్ఎస్ నేత, అంధోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. ములుగు జిల్లా కర్రిగుట్టల ప్రాంతాన్ని వేలాది సాయుధ బలగాలు చుట్టుముట్టాయని, అకడ పదులసంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిణామాలు శాంతి చర్చల ప్రక్రియకు భంగం కలిగించేవిగా ఉన్నాయని అన్నారు. కాల్పులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.