హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, పెద్ద కమతాలు అమెరికాలోని రైతుల విజయ రహస్యాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పత్తి సాగులో ఆధునిక పద్ధతులు, అధిక సాంద్రత సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం మంత్రి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో అధిక సాంద్రత పత్తి సాగు బాగున్నదని చెప్పారు. వర్షాధారమైతే ఈ పద్ధతిలో హెక్టారుకు 60 వేల నుంచి 75 వేల మొక్కలు, సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కల వరకు నాటవచ్చని వివరించారు.
భవిష్యత్తులో హెక్టారుకు లక్ష 40 వేల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా టెక్సాస్లోని రైతులు పత్తి పంట తర్వాత జొన్న సాగు చేస్తూ పత్తిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మన దేశంలోని పాలకులకు ముందుచూపు లేకపోవడం వల్ల అత్యధిక శాతం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయరంగం ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో రాష్ట్ర వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారుతున్నదని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి రాకతో తెలంగాణ రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. పంటల వైవిధ్యీకరణ, యాంత్రీకరణ పెంచి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయరంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, మెతుకు ఆనంద్, రవీంద్రకుమార్, సీడ్స్ ఎండీ కేశవులు ఉన్నారు.