హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల భవితవ్యం మంగళవా రం తేలనున్నది. ఈ పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మరికొన్ని గంటల్లో హైకోర్టు తీర్పు వెలువరించనున్నది. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తన తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 7న ప్రకటించారు. ఇప్పుడు ఆ తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.