హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి హోదాలో సిద్దిపేట కలెక్టర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల 8న జారీ అయిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, మరో ముగ్గురు సెర్ప్ ఉద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ చేపట్టారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఫిర్యాదు మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 129, 134 సెక్షన్ల కింద 66 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్లు సివిల్ సర్వెంట్లు కారని, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించనందున 129,134 సెక్షన్లు వర్తించవని వివరించారు. పిటిషనర్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కు లేదని తెలిపారు. దీంతో సస్పెన్షన్ ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్ 25కి వాయిదా వేశారు. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.