High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీచేసింది. సాధారణంగా స్పీకర్కు కోర్టులు నోటీసులు జారీ చేయవు. స్పీకర్ కార్యాలయానికో, స్పీకర్ కార్యదర్శికో నోటీసులు జారీ చేసి సంబంధిత కేసులపై విచారణ చేపడతాయి. అయితే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని సవాలు చేసిన కేసులో తొలి ప్రతివాదిగా ఉన్న శాసనసభాధిపతి (స్పీకర్)కి నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత ఇతర ప్రతివాదులైన రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, పదో షెడ్యూల్ మేరకు స్పీకర్ సారథ్యం వహించే ట్రిబ్యునల్, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్గౌడ్, ఎం సంజయ్కుమార్, జీ మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ (కిలారి ఆనంద్ పాల్) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేఏ పాల్ వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే అనర్హత వేటువేయాలని కోరారు. ఇదే అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. ప్రజలు మ్యానిఫెస్టోను చూసి ఓట్లు వేశారని, ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలోకి వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ఒక వ్యాపారంగా మారిపోయిందని కేఏ పాల్ ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ప్రజాతీర్పుకు అర్థం లేకుండాపోతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాంపై విచారణ జరిగి తీర్పు వెలువడేవరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను శాసనసభలోకి ప్రవేశించకుండా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చట్టసభలో ఓటింగ్లో పాల్గొనే అర్హత లేకుండా చేయాలని కూడా కోరారు. వాళ్ల వేతనాలను కూడా నిలుపుదల చేయాలన్నారు. ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తేనే ఫిరాయింపుదారుల్లో భయం ఉంటుందని, మరొకరు పార్టీ ఫిరాయింపునకు ముందుకురారని సూచించారు. ఐదేండ్లు ముగిసే వరకు ఫిరాయింపునకు పాల్పడిన చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారుల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశారని చెప్పారు. దానం నాగేందర్ ఇతరులపై పార్టీ చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 10 మంది ఎమ్మెల్యేలతోపాటు ఈసీ, ట్రిబ్యునల్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.