హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోగా బాధిత రైతులు ఇచ్చిన లీగల్ నోటీసును స్వీకరించని రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జీతాలు తీసుకొని ప్రజా సమస్యలపై స్పందించకపోతే ఎలాగని నిలదీసింది. భూసేకరణ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రైతులు ఇచ్చిన నోటీసులను స్వీకరించకపోవడాన్ని సవాలు చేసిన కేసులో సదరు అధికారి కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలన్న ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మెమో దాఖలు చేశామని, అందుకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది వినతిని తిరసరించింది. బాధిత రైతుకు అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలన్న చట్ట నిబంధనను ఉల్లంఘించడమే కాకుండా లీగల్ నోటీసును స్వీకరించేందుకు ఎందుకు నిరాకరించారని నిలదీసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము గతంలో జారీచేసిన ఆదేశాలను అమలు చేయరా అని ప్రశ్నించింది. హాజరు మినహాయింపునకు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
భూసేకరణ అవార్డు రూ.19.5 లక్షల సొమ్మును చట్టప్రకారం 15 శాతం వడ్డీతో చెల్లించకపోవడంపై లీగల్ నోటీసును తిరసరించడాన్ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన జోగినపల్లి మంగమ్మ సహా ముగ్గురు రైతులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. భూసేకరణ అధికారి హాజరుకు గత నెల 29న జారీచేసిన ఉత్తర్వుల మేరకు అధికారి విచారణకు హాజరుకాలేదు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ డిప్యూటీ సీఎంతో సమావేశం ఉన్నందున హాజరు మినహాయింపునివ్వాలని మెమో దాఖలు చేసినట్టు చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.