హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అనుమతులు లేకుండా లేదా విధివిధానాలు పాటించకుండా భూములకు ఫెన్సింగ్ వేస్తున్న ఘటనలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేవలం ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్నాయనే కారణంతో ఏ భూమికైనా ఫెన్సింగ్ వేయడానికి వీలులేదని హైడ్రా కమిషనర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనా బాధ్యతను నిర్ధారించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను సుమోటో ప్రతివాదిగా చేర్చింది.
హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో 1.26 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ అయిన వ్యాపారవేత్త.. తన భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని చెప్పి హైడ్రా అధికారులు అక్రమంగా ఫెన్సింగ్ వేసి, అకడ బోర్డు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ చర్యలు చట్ట విరుద్ధమని పేరొంటూ, భూమి నుంచి తనను తొలగించకుండా నిలుపుదల చేయాలని, హైడ్రా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, బోర్డు తొలగించాలని కోరారు.
పిటిషనర్ వాదనల అనంతరం హైకోర్టు.. ఆధారాలను పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉందనే కారణంతో మాత్రమే భూములకు ఫెన్సింగ్ వేయరాదని హైడ్రా కమిషనర్ను ఆదేశించింది, ఫెన్సింగ్ చర్యలకు ముందు సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టత తీసుకోవాలని కూడా సూచించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కూడా భూముల చట్టపరమైన స్థితిని పరిశీలించి, వాటికి సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయో లేదో అనే విషయాన్ని నిర్ధారించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్, కోర్టు రిజిస్ట్రీ ద్వారా కమిషనర్కు తెలియజేయాలంది, విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది.