Spices | బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమాలు, వ్యాయామం, సరైన నిద్ర వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీర జీవక్రియకు తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, బరువు నియంత్రణకు ఉపయోగపడే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ ఒకేలా ఉండదని, వీటి ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతుందని గుర్తుంచుకోవాలి. పసుపు అందరి వంటిళ్లలోనూ సాధారణంగా కనిపించే సుగంధ ద్రవ్యం. ఇది శరీరంలో వేడిని పెంచడం ద్వారా జీవక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సూప్లు, తాజా కూరగాయలు, నట్స్ వంటి వాటిపై కొద్దిగా పసుపు చల్లుకుని తీసుకోవచ్చు.
దాల్చిన చెక్క కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడే మసాలా దినుసుల్లో ఒకటి. ఇది తీపి పదార్థాలపై కోరికలను తగ్గించడంలో, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది. ఓట్స్, పాలు, పెరుగు, టీ లేదా కాటేజ్ చీజ్ వంటి వాటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు. కారం ఎక్కువగా ఉండే కేయెన్ పెప్పర్ శరీర జీవక్రియను పెంచే మసాలాగా పనిచేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా జీవక్రియను ప్రేరేపిస్తుంది. అయితే దీన్ని అధికంగా తీసుకోకుండా పరిమితంగా ఉపయోగించడం మంచిది. జీలకర్ర కూడా బరువు తగ్గడానికి అనుకూలమైన మసాలాగా ఉంటుంది. ఆహారంలో ఒక టీస్పూన్ జీలకర్రను ఉపయోగించడం వల్ల కొవ్వు దహనం పెరుగుతుంది. జీలకర్రను నేరుగా వంటల్లో ఉపయోగించడంతోపాటు, వేయించి పొడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. జీలకర్ర నీటిని కూడా బరువు తగ్గడానికి ఉపయోగించే పానీయంగా తీసుకోవచ్చు.
అల్లంలో కూడా పసుపు, కేయెన్ పెప్పర్ మాదిరిగా జీవక్రియను ప్రోత్సహించే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా చక్కెర, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అల్లం సహాయపడుతుంది. వంటల్లో కొద్దిగా తురిమిన అల్లం కలుపుకోవడం ద్వారా రుచితోపాటు జీవక్రియకు కూడా తోడ్పాటు లభిస్తుంది. మిరియాలు కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడే మసాలాల్లో ఒకటిగా ఉన్నాయి. శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధించడంలో ఇవి సహాయపడతాయి. అందువల్ల వివిధ రకాల ఆహారాల్లో మిరియాలను పరిమితంగా ఉపయోగించవచ్చు.
యాలకులు కూడా శరీర ఉష్ణోగ్రతను, జీవక్రియను పెంచే థర్మోజెనిక్ మసాలాగా పనిచేస్తాయి. భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే యాలకులను బిర్యానీ, ఖీర్ వంటి వంటకాల్లో రుచి, సువాసన కోసం ఉపయోగిస్తారు.
మెంతులు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్యమైన మసాలా దినుసుల్లో ఒకటిగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను శాంతపరచడంతోపాటు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి జీర్ణవ్యవస్థను రక్షించడంలో సహాయపడతాయి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టి ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియకు, బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడుతాయి. అయితే బరువు తగ్గడంలో ఒక్క మసాలా దినుసుపైనే ఆధారపడటం సరైన పద్ధతి కాదు. ప్రతి వ్యక్తి శరీర జీవక్రియ భిన్నంగా ఉంటుంది కాబట్టి, ఈ మసాలాల ప్రభావం కూడా ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు వీటిని ఉపయోగించే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.