హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్ను హైకోర్టు నిలదీసింది. ఏపీలో చదివినట్టు స్వయంగా ఆ విద్యార్థినే చెప్తున్నప్పటికీ స్థానిక ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. జరిగిన తప్పిదానికి బేషరతుగా క్షమాపణ చెప్పకపోగా ఇన్స్పెక్టర్ నివేదిక ఆధారంగా ఆ ధ్రువపత్రంపై సంతకం చేశానని తాసిల్దార్ చెప్పడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించినప్పటికీ తనకు మెడికల్ అడ్మిషన్ ఇవ్వలేదంటూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన సింగోటం వెన్నెల దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఆమె గత 18 ఏండ్లుగా తెలంగాణలో నివాసం ఉంటున్నట్టు ధ్రువపత్రాన్ని జారీచేయడం విస్మయాన్ని కలిగిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలన్న ఆదేశాలను తాసిల్దార్ పాటించకపోవడం వల్లనే గతంలో బెయిలబుల్ వారెంట్ జారీచేశామని గుర్తుచేసింది. ఈ దశలో కూడా తాసిల్దార్లో పశ్చాత్తాపం లేకపోవడం తీవ్ర విషయమని మండిపడింది. డిసెంబర్ 4న జరిగే తదుపరి విచారణకు తాసిల్దార్తోపాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.