హైదరాబాద్, నవంబర్ 24, (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో నేతలపై ఉన్న కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీకి శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటో పిటిషన్గా హైకోర్టు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నేరాల తీవ్రత ఆధారంగా కేసుల జాబితా ఇవ్వాలని, జిల్లా కోర్టులతోపాటు హైకోర్టులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల వివరాలను అందజేయాలని కేసుల విచారణ దశ స్పష్టం చేస్తూ రెండు వారాల్లో సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధిపై ఉన్న కేసుల విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉరి, యావజ్జీవ శిక్ష పడే కేసులకు మొదటి ప్రాధాన్యం, ఐదేండ్లు అంతకంటే ఎకువ శిక్ష పడే కేసులకు ఆ తర్వాత విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. ప్రత్యేక కారణాలు ఉంటేనే కేసుల విచారణ వాయిదాకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా, కేసులు ఏ సంవత్సరంలో నమోదయ్యాయో, ప్రొసీడింగ్స్ ఏ దశలో ఉన్నది వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పింది. తెలంగాణాలో 2022 నాటికి 17 కేసులు ఉన్నాయని హైకోర్టు తరఫు సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ తెలిపారు. వాస్తవ సంఖ్య తెలియాలంటే అన్ని కోర్టుల నుంచి వివరాలను తెప్పించాలని అన్నారు. రెండు వారాల గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలను అందజేస్తామని చెప్పడంతో అందుకు హైకోర్టు అనుమతించింది.