రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని కోర్టు సమర్ధించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశం సరైనదేనని పేర్కొంది.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. బదిలీలపై ఈ ఏడాది ఫిబ్రవరి 14న, మార్చి 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. అయితే, బదిలీలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని కోర్టు సమర్ధించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశం సరైనదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన జీవో నంబర్ 9 చట్ట వ్యతిరేకమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం థోల్కట్టకు చెందిన సకుబాయి, మరికొంతమంది దాఖలుచేసిన పిటిషన్తోపాటు జీవో 5ను సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ పిటిషన్ల ఆధారంగా టీచర్ల బదిలీలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని రాష్ట్రప్రభుత్వం కోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులోని అంశాలకు అనుగుణంగా ధర్మాసనం బదిలీలకు అనుమతిచ్చింది. రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు వాదనలు వినిపిస్తూ బదిలీలపై స్టే వల్ల విద్యాశాఖలో పనులు నిలిచిపోయాయని తెలిపారు. త్వరలోనే శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయని, ఎన్నికల్లో టీచర్లు కీలకపాత్ర పోషించాల్సి ఉన్నందున స్టే ఎత్తివేయాలని కోరారు.
రాజ్యాంగంలోని అధికరణ 309 ప్రకారం ఉద్యోగులను బదిలీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని జే రామచందర్రావు చెప్పారు. బదిలీల నిబంధనలను ఆగస్టు 5వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టి అనుమతి పొందినట్టు తెలిపారు. తెలంగాణ విద్యాచట్టం 2005లో ఉపాధ్యాయ బదిలీల అంశం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులైన భార్యభర్తలు ఒకేచోట పనిచేసేలా నిబంధనలు ఉన్నాయని, వీరికి కూడా అదనపు పాయింట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ విద్యాచట్టం 1982 నిబంధనలను సవరిస్తూ, తెలంగాణ టీచర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రూల్స్ 2023కు లోబడే జనవరి 25న జీవో 5 ద్వారా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని చెప్పారు. చట్టంలో చేసిన మార్పులను రాష్ట్ర శాసనసభ దృష్టికి ప్రభుత్వం తెచ్చిందని, సభకు ఈ వివరాలన్నీ నివేదించామని వెల్లడించారు. వీటిని గమనంలోకి తీసుకొని ఉపాధ్యాయ బదిలీపై గతంలోని ఇచ్చిన స్టేను రద్దు చేయాలని కోరారు. బదిలీల కోసం సుమారు 60 వేల మంది టీచర్లు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం నిబంధనలను రూపొందించడం ఇదే తొలిసారి కాదని, 2018 జూన్లో జీవో 15 జారీ చేసిందని సీనియర్ న్యాయవాది సురేందర్రావు తెలిపారు. తెలంగాణ విద్యాచట్టం కింద 2005లో తెచ్చిన నిబంధనలు అమల్లో లేవని, వేమారెడ్డి-ఏపీ ప్రభుత్వం మధ్య కేసులో హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చికుడు ప్రభాకర్, కృష్ణయ్య వాదిస్తూ.. చట్టంలో మార్పుల అంశంపై శాసనసభ ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనల తర్వాత గతంలోని స్టే ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. రూల్ 6(10)కి అనుగుణంగా బదిలీలకు అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించేందుకు సమ్మతించింది. బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ తీర్పుతో టీచర్ల బదిలీలకు అడ్డంకులు తొలగిపోయాయి.