సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాల్కు చెందిన కల్పన అనే మహిళ తన గ్యాంగ్తో కలిసి ఆ అధికారి భార్య తనూజను హత్య చేసి ఇంట్లో ఉన్న నగదు, నగలను ఎత్తుకుని పారిపోయింది. సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల నివాసాల దగ్గర భద్రత పకడ్బందీగా ఉంటుంది. పోలీసుల గస్తీ నిరంతరం కొనసాగుతుంది. ఇలాంటి ప్రాంతంలోనే పోలీసు కుటుంబంలోనే దారుణం జరగడం పోలీసులకు సవాల్గా మారింది. నగరంలో పనిమనుషుల దొంగతనాలు పెరుగుతుండడంతో హైదరాబాద్ సిటీ పోలీసు అప్రమత్తమైంది.
పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే నిర్లక్ష్యమే ఈ దొంగతనాలకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. తగిన విచారణ లేకుండా పనిలో కుదుర్చుకుంటే విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనుల ఒత్తిడిలో ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే విద్యార్థులు, వృద్ధులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు. ఇండ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయటపడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొందరు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానులు చూపే ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతున్నదని పోలీసులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులకు పనిమనుషుల దొంగతనాలు సవాల్గా మారాయి. దోపిడీలు, హత్య చేసిన కేసుల్లో నేపాలీ గ్యాంగులు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. రెండు నేపాలీ గ్యాంగులు పకడ్బందీ ప్లాన్తో దోపిడీ చేసి పారిపోయాయి. సీసీ కెమెరాలకు చిక్కకుండా పోలీసుల దర్యాప్తునకు అందకుండా పోయాయి. జూబ్లీహిల్స్ మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పనిమనిషి కల్పన గ్యాంగ్ జాడే లేదు. రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలకు చిక్కకుండా నిందితులు తప్పించుకున్నారు. దర్యాప్తు కోసం పదికి పైగా బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నిందితులను పట్టుకోలేకపోవడం గమనార్హం.
గత రెండేళ్లలో నగరంలో 565 పనిమనుషుల దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో 65 గ్రేవ్ కేసులు కాగా 500 నాన్గ్రేవ్ కేసులుగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. జోన్ల వారీగా కేసులను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ జోన్లో అత్యధికంగా 173 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్ జోన్లో 88, ఖైరతాబాద్ జోన్లో 77, గోల్కొండ జోన్లో 70, రాజేంద్రనగర్ జోన్లో 63, శంషాబాద్ జోన్లో 49, చార్మినార్ జోన్లో 45కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా ఇటీవల ఇతర దేశాలు, రాష్ర్టాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల రూపంలో ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో తగిన గుర్తింపు, పోలీసు వెరిఫికేషన్ లేకుండా అపరిచిత వ్యక్తులను పనిలో చేర్చుకోవద్దని పోలీసు యంత్రాంగం నగరవాసులకు సూచించింది.
నమ్మకంగా పనిలో చేరిన కొత్తలో యజమానుల అలవాట్లు, తాళాలు ఉంచే ప్రదేశాలు, సీసీ కెమెరాల కదలికలు, నగదు-నగల వివరాలను గమనించి నేరాలకు పాల్పడుతున్నందున పని మనుషుల పూర్వాపరాలు తెలియకుండా వారిని పనిలో చేర్చుకోవద్దని చెప్పారు. ప్రధానంగా జోన్ల వారీగా పరిణామాలు పరిశీలిస్తే ఐటీ సంస్థలు, వ్యాపారవర్గాలు, ఉన్నతనివాస ప్రాంగణాలు, ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆఫీసుల్లో, దుకాణాల్లో, ఇళ్లలో యజమానులు బిజీ జీవనశైలి కారణంగా తగిన ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.