Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి తప్పనిసరిగా హాజరుకావాలని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం, మంత్రులను ఆదేశించింది.
బుధవారం ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకోగా, మంత్రులు సైతం ఢిల్లీ బాట పట్టారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొన్నారు. గురువారం ఉదయం మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఈ సమ్మిట్కు హాజరుకానున్నారు. కాగా, ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల ప్రత్యేక సమావేశంపై పార్టీలో చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో, ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయోననే ఆందోళన వారిలో నెలకొన్నది.