భూపాలపల్లి: ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది. దీంతో పుష్కరఘాట్ మెట్ల నుంచి రోడ్డుపైకి వరద నీరు చేరింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. మేడిగడ్డ బ్యారేజీకి 13.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. దీంతో 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న అన్నారం బ్యారేజీకి 5.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహం వస్తుండటంతో 66 గేట్లు ఎత్తి 5.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా, నిజాం సాగర్ ప్రాజెక్టుకు 20 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.66 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. అదేవిధంగా 17.802 టీఎంసీల నీటికిగాను 17.311 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.